ప్రస్తుతం తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నారు. ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ బీజేపీ లో మంచి ఉత్సాహం రావడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధ్యమయ్యాయి.
అసలు తెలంగాణలో ఉన్నా, లేనట్టుగా బిజెపి ఉండేది. మొదటి స్థానంలో టిఆర్ఎస్ , రెండో స్థానంలో కాంగ్రెస్ , మూడో స్థానానికి బిజెపి పోటీ పడేది.
అయితే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. దుబ్బాక , హుజురాబాద్ ఎన్నికలతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపికి కాస్త సానుకూల ఫలితాలు దక్కాయి.
దీంతో అధిష్టానం పెద్దలకు సైతం బండి సంజయ్ నాయకత్వంపై నమ్మకం పెరిగింది. ఆయనను మరింత ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసేందుకు కూడా ఆయనకు స్వతంత్రం కల్పించారు. ఇదిలాఉంటే హుజురాబాద్ లో కీలక నాయకుడిగా, టిఆర్ఎస్ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ఆ తర్వాత టిఆర్ఎస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు రావడం ఆ ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ ఎన్ని రకాలుగా గెలుపు కోసం ప్రయత్నాలు చేసినా, ఈటల రాజేందర్ తనకున్న పలుకుబడితో హుజూరాబాద్ నియోజకవర్గం లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలవగలిగారు.
దీంతో రాజేందర్ సత్తా ఏమిటనేది బీజేపీ అధిష్టానం పెద్దలకు, తెలంగాణ నాయకులకు అర్థమైపోయింది.
తెలంగాణలో బిజెపికి సీఎం అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పేరు గత కొద్ది రోజులుగా మారుమోగుతూనే ఉంది.
ఇది ఇలా ఉంటే ఇప్పుడు తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో ఈటెల రాజేందర్ కు అవకాశం కల్పించబోతున్నారని, ఆయన సారధ్యంలోనే బిజెపి 2023 ఎన్నికలకు వెళ్లబోతోంది అనే ప్రచారం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో మొదలైంది. దీనికి కారణం కరీంనగర్ మేయర్ సునీల్ రావు చేసిన వ్యాఖ్యలే కారణం .సునీల్ రావు తెలంగాణ బిజెపి అధ్యక్షుడుని మారుస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.
అంతే కాదు తెలంగాణ బీజేపీ లో బండి సంజయ్ ను వ్యతిరేకిస్తున్న వారంతా ఇప్పుడు ఈటెల రాజేందర్ వైపు ఉండడం, ఆయనకు అధ్యక్ష స్థానం దక్కబోతోంది అనే ప్రచారం చేస్తూ ఉండటం వంటి వ్యవహారాలు సంజయ్ వర్గానికి మింగుడు పడడం లేదు.ప్రస్తుత వ్యవహారాలపై అటు బండి సంజయ్ కానీ, ఈటెల రాజేందర్ కానీ స్పందించడం లేదు.సైలెంట్ గానే అధిష్టానం పెద్దలు దృష్టిలో పడేందుకు రకరకాల మార్గాల ద్వారా వారు ప్రయత్నాలు చేస్తున్నారు.