తెలంగాణలో క్రమ క్రమంగా బలం పెంచుకుంటూ వస్తున్న బిజెపి ఒక సరికొత్త వ్యూహంతో రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతోంది.ఇప్పటికే బీజేపీ దూకుడుతో తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఇరుకున పడుతూ వస్తోంది.దీంతో పాటు రాబోయే ఎన్నికల్లో అధికారం దూరమవుతుందనే టెన్షన్ లోనూ ఉంది.2014 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న టీఆర్ఎస్ పై ప్రజలలో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయిందని, టీఆర్ఎస్ ఇప్పుడు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది అని గ్రహించిన బిజెపి నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే ఏకైక లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. దుబ్బాక, గ్రేటర్ లో వచ్చిన ఫలితాలతో మంచి ఉత్సాహంగా ఉన్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ యాత్ర ద్వారా అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి, ప్రజల్లో మరింత బలం పెంచుకోవడంతో పాటు, అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ, ప్రజలలో చర్చ జరిగే విధంగా చేయాలని డిసైడ్ అయ్యారు.
అందుకే ముందుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజక వర్గాల్లోనూ పర్యటించి, బిజెపి బలం పెరిగే విధంగా చేసుకోవాలని చూస్తున్నారు.బస్సుయాత్ర ద్వారా వచ్చిన రెస్పాన్స్ ను బట్టి తరువాత పాదయాత్ర చేపట్టేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు.
ఈ మేరకు ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా పూర్తిగా సంజయ్ కు స్వాతంత్రం కల్పించడంతో రెట్టింపు ఉత్సాహంతో ఆయన సరి కొత్త ఎత్తుగడలు వేస్తూ, ముందుకు వెళ్తున్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కాస్త గట్టిగా కష్టపడుతూ, ప్రజల్లోకి వెళ్లి బలం పెంచుకుని ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడితే తప్పకుండా విజయం దక్కుతుందనే ఆలోచనతో వున్నట్టు గా కనిపిస్తున్నారు.అందుకే ఈ బస్సు యాత్ర, పాదయాత్రల కాన్సెప్ట్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నుంచి చూసుకుంటే, ఈ యాత్ర ల ఫార్ములా సక్సెస్ అవుతూ వస్తోంది.
దివంగత రాజశేఖర్ రెడ్డి తరువాత చంద్రబాబు, జగన్ ఇలా అందరూ యాత్ర చేపట్టి వారంతా అధికారంలోకి రావడంతో, ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ఫాలో అవ్వాలి అని సంజయ్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తున్నారు.త్వరలోనే బస్సుయాత్ర, పాదయాత్ర కు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు.