ఏపీలో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ అక్కడ బాగా బలపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఇక పవన్ కూడా అదే రేంజ్ లో బీజేపీతో పొత్తు ద్వారా ఏపీలో తిరుగులేని ఆధిపత్యం సాధించాలని పవన్ చూస్తున్నారు.
ఇది ఇలా ఉండగానే ఇప్పుడు తెలంగాణలోనూ పవన్ ను వాడేసుకునేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తోంది.ఏపీలో ఎలా అయితే బలపడాలని చూస్తుందో అదే రేంజ్ లో తెలంగాణాలోనూ బలపడాలని బీజేపీ కళలు కనడమే కాకుండా దాన్ని సాకారం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
అయితే ఇక్కడ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ హవా ముందు బీజేపీ తేలిపోతోంది.కేంద్ర అధికార పార్టీగా ఉన్నా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.
గత సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాస్తో కూస్తో ఫలితాలను సాధించింది.దీంతో మరింత ధీమా బీజేపీలో పెరిగింది.కానీ ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓటమి చెందడంతో మళ్ళీ ఆందోళన మొదలయ్యింది.ఇలా అయితే వచ్చే సాధారణ ఎన్నికలనాటికి పరిస్థితి ఏంటి అనేది బీజేపీలో మొదలయ్యింది.
ఈ సమయంలోనే పవన్ పై తెలంగాణ బీజేపీ నాయకులు కన్నేశారు.ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే ఉంటూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేయిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని బీజేపీ తెలంగాణ శాఖ భావిస్తోంది.
ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇటీవల జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో కీలక సమావేశాన్ని నిర్వహించినట్టు సమాచారం.వీరిద్దరి భేటి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.రెండు రోజుల క్రితమే ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది.పవన్ రాకతో తెలంగాణ బీజేపీ బాగా బలపడుతుందని బలంగా నమ్ముతున్నారు.తొందర్లోనే దీనికి సంబంధించి అధికార ప్రకటన చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేసుకుంటోంది.