తెలంగాణ బీజేపీ లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ముద్రపడిన రాజాసింగ్ ఎప్పుడూ ఏదో ఒక అంశంపై, ఏదో ఒక వివాదంతో వార్తల్లో వ్యక్తిగా ఉంటూ ఉంటారు.బీజేపీ తరపున బలంగా వాయిస్ వినిపించడంతో పాటు, అసలు సిసలైన బీజేపీ వాదిగా ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళుతూ ఉంటారు.
తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభావం జోరుగా ఉన్న సమయంలోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఇక హిందుత్వం విషయంలో ఎవరితోనైనా తలపడేందుకు ఆయన ఎప్పుడూ ముందుంటారు.
హిందుత్వం కోసం గో సంరక్షణ వంటి విషయాల్లో యాక్టివ్ గా ఉంటూ బీజేపీకి మేలు చేసే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు.ఇదిలా ఉంటే తాజాగా రాజాసింగ్ పార్టీ నాయకుల వ్యవహారశైలిపై కాస్త అలిగినట్లుగా కనిపిస్తున్నారు.
తనకు ఏ విషయంలోనూ రాష్ట్ర నాయకులు సహకరించడం లేదని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.అలాగే అసెంబ్లీలో మాట్లాడడానికి తనకు తగిన విధంగా సహకరించడంలేదని రాజాసింగ్ వాపోతున్నారట.
అలాగే అసెంబ్లీ సమావేశాల్లోనూ, బయట, అధికార పార్టీ నాయకులు, మంత్రులు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తూ ఉంటే, చూస్తూ ఊరుకోలేక తాను అసెంబ్లీకే వెళ్లడం లేదని ఆయన తన సన్నిహితుల వద్ద తన బాధను చెప్పుకున్నారట.పార్టీలో తనకు గౌరవం ఇవ్వని నాయకుల తీరుపైన ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
బీజేపీకి ఎమ్మెల్యేగా ఉన్న తన విషయంలో ఎందుకు ఈ విధంగా వివక్ష చూపిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన వాపోతున్నారట.వాస్తవంగా చెప్పుకుంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే ముందే ఏఏ అంశాలపై చర్చించాలనే విషయంపై రాష్ట్ర నేతలకు రాజాసింగ్ లేఖ రాశారు.కానీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఆ లేఖను పట్టించుకోలేదు.దీంతో ఆయన అసెంబ్లీ సమావేశాలపై వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కరోనా నియంత్రణ విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను నిలదీయాలని రాజాసింగ్ అనుకున్నా, రాష్ట్ర నాయకత్వం సహకరించకపోవడంతో, ఆయన కూడా రాష్ట్ర నాయకత్వానికి సహకరించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తంగా తెలంగాణ బీజేపీ లోని కీలక నాయకులు ఎమ్మెల్యేగా ఉన్న తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు అనేది రాజాసింగ్ ఆవేదనగా కనిపిస్తోంది.
ఈ వ్యవహారం అధిష్టానం పెద్దల వరకు వెళ్తే, ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారో , రాజాసింగ్ ను ఏ విధంగా బుజ్జగిస్తారో చూడాలి.