తెలంగాణ బీజేపీ నాయకుల్లో ఇప్పుడు ఎక్కడలేని కంగారు మొదలయినట్టు కనిపిస్తోంది.ఏ నాయకుడు చూసినా గ్రామాల వెంట, వీధుల వెంట కంగారు కంగారుగా తిరుగుతూ హడావుడిపడిపోతున్నారు.
ఇప్పటి వరకు కేవలం పార్టీ ఆఫీస్ లకు, ప్రెస్ నోట్లకు పరిమితం అయిన వీరంతా ఇప్పుడు క్షేత్ర స్థాయిలో తిరుగుతుండడం వెనుక పెద్ద కారణమే ఉందట.దీనికి కారణం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షానే అని తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి చేసిన సూచనలు, ఇచ్చిన గట్టి హెచ్చరికలతో పార్టీ నాయకులంతా సభ్యత్వ నమోదు కోసం గ్రామాల వెంట తిరుగుతూ హడావుడి చేస్తున్నారు.తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా 18లక్షల సభ్యత్వాలను చేయాల్సిందేనంటూ టార్గెట్ పెట్టారు.
అంతే కాదు ఆ టార్గెట్ కనుక మీరు పూర్తి చేయలేకపోతే అప్పుడు నేనే స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణాలో ఇంటింటికి తిరిగి సభ్యత్వాలను నమోదు చేస్తానంటూ చెప్పడంతో బీజేపీ నేతల్లో కంగారు మొదలయ్యింది.కొద్ది రోజులుగా బీజేపీ అధిష్టానం తెలంగాణ మీద పూర్తి ఫోకస్ పెట్టింది.అందుకే ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడంతో పాటు పార్టీ సభ్యత్వాలపై ఇంతగా దృష్టిపెట్టింది.ప్రస్తుతం బీజేపీకి ఉన్న సభ్యత్వాలకు రెండింతల సభ్యత్వాలను నమోదు చేయడమే లక్ష్యంగా నాయకులు ముందుకు కదులుతున్నారు.
ఇప్పటివరకు ఏడు లక్షల సభ్యత్వాలను పూర్తిచేశారు.ఆన్లైన్లో మరో రెండు లక్షల మంది సభ్యత్వం చేసుకున్నట్లు బీజేపీ నేతలు చెపుతున్నారు.
ఆగస్ట్ 11తో సభ్యత్వ నమోదుకు గడువు పూర్తి అవ్వబోతున్న నేపథ్యంలో ముఖ్య నాయకులంతా గ్రామల బాట పట్టారు.దీంతో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వెలవెలబోతోంది.గత ఏడాది సభ్యత్వ నమోదుకు అమిత్ షా పెట్టిన టార్గెట్ ను తెలంగాణ బీజేపీ నాయకులు చేరుకోలేకపోయారు.దీంతో అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ నాయకులకు గట్టిగానే మందలించారట.
ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు.ఈసారి అటువంటి తప్పు జరగకుండా చూసుకోవడంతో పాటు అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు.
అయితే వీరు అనుకుంటున్నట్టుగా సభ్యత్వ నమోదులో టార్గెట్ పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారో లేక అక్షింతలు వేయించుకుంటారో చూడాలి.