మొన్నటి వరకు ఒక రకంగా, ఇప్పుడు మరో రకంగా తయారైంది తెలంగాణ బిజెపి పరిస్థితి.స్థానికంగా బలపడేందుకు ,తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ నేతలు చేయని ప్రయత్నం లేదు.
తరచుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.ఈ రెండు పార్టీల మధ్య ఉప్పు నిప్పులా పరిస్థితి ఉన్న సమయంలోనే, అకస్మాత్తుగా తెలంగాణ సీఎం కేసీఆర్ డిల్లీ టూర్ పెట్టుకున్నారు.
అక్కడ బిజెపి కేంద్ర పెద్దలను కలిసి అనేక అంశాలపై చర్చించారు.ఇప్పుడు అదే తెలంగాణ బిజెపి నేతలకు ఇబ్బందికరంగా మారింది.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ కేంద్ర మంత్రులు వరుసగా పర్యటనలు చేస్తున్నారు.
వారు టిఆర్ఎస్ విషయం లో ఏ రకమైన ప్రసంగాలు చేస్తారు అనేది స్థానిక నేతలకు టెన్షన్ గా మారింది.
ఈ టెన్షన్ తోనే కేంద్ర మంత్రులు టిఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడకుండా, ముందస్తుగానే బీజేపీ నేతలు అలెర్ట్ అవుతున్నారు.తాజాగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్ రాగానే ఆయనను బిజెపి నేతలు రిసీవ్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన షెడ్యూల్ లో ప్రగతిభవన్ లో కేసీఆర్ తో లంచ్ ఉండడంతో, బీజేపీ నేతలు ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు.జ్యోతిరాదిత్య సింధియా ప్రగతి భవన్ కు వెళ్లకుండా ఆపేందుకు గట్టి ప్రయత్నాలు చేశారట.
అయితే ఇది ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కావడంతో తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన అక్కడికి వెళ్లారు.ఇక ఆ తర్వాత ఆయన ఏ ప్రసంగం చేస్తారా అనేది బీజేపీ తెలంగాణ నేతలకు టెన్షన్ పట్టుకుంది.
రాబోయే రోజుల్లో బిజెపి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పడంతో వీరంతా రిలాక్స్ అయ్యారు.ఇక మరో మంత్రి శోభ కరంధ్లాజ్ విషయంలోనూ బీజేపీ నేతలు అలెర్ట్ అయ్యారు.ఆమె అధికారిక కార్యక్రమానికి వచ్చినా, సంజయ్ పాదయాత్రలోనూ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె టిఆర్ఎస్ ప్రభుత్వం ను మెచ్చుకున్నారనే ప్రచారం మీడియాలో హైలెట్ అవ్వగానే, గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టారు.ఇక కేంద్రం నుంచి ఏ మంత్రి వచ్చినా టిఆర్ఎస్ కు అనుకూలంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా తెలంగాణ బిజెపి నేతలు ఎప్పటికప్పుడు టెన్షన్ పడుతూ అలెర్ట్ అవుతున్నారు.