టిఆర్ఎస్ అసంతృప్త నేతలే టార్గెట్ గా తెలంగాణ బిజెపి ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంది.మీరు మా పార్టీలో చేరాలని, మీరు చేరితే మీకు సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆశల పల్లకి ఎక్కించేస్తున్నారు.
ఇటీవల టిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన ఈటెల రాజేందర్ ద్వారా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలను బిజెపి గుర్తిస్తోంది.చాలా కాలం నుంచి వారు పార్టీలో ఉన్నా, సరైన పదవులు లేక టిఆర్ఎస్ అధిష్టానంపై ఆగ్రహంతో ఉంటూ, వేరే ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న నేతలు ఎవరు అనే అంశంపై తెలంగాణ బీజేపీ ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించింది.
ఎలాగూ కాంగ్రెస్ తెలంగాణలో బలహీనం కావడంతో టిఆర్ఎస్ లో ఇమాడ లేని వారంతా బీజేపీలో చేరతారనే ఆశలు పెట్టుకుంది .అది కాకుండా తెలంగాణలో ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి.వాటిని తెలంగాణ శాసనసభ్యుల కోటలో ఎన్నుకుంటారు . ఆరుగురు శాసనమండలి సభ్యుల పదవీ కాలం జూన్ 3 తో ముగియనుండడంతో ఆ పదవులు కోల్పోతున్న గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఫరీదుద్దీన్ , ఆకుల లలిత తదితరులు మళ్లీ రెన్యువల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇప్పుడు ఆ స్థానాలను దక్కించుకునేందుకు టిఆర్ఎస్ లో చాలా మంది ఆశావహులు పోటీ పడుతున్నారు.ఎంతో మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తాను అంటూ కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో , వారంతా ఇప్పుడు ఆశలు పెట్టుకున్నారు.
కడియం శ్రీహరి , గుత్తా సుఖేందర్ రెడ్డి ,మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రవీందర్రావు, తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇలా ఎంతోమంది ఎదురు చూపులు చూస్తున్నారు.దాదాపు ఈ లిస్టు 20 మంది వరకు ఉండడం, వీరంతా తెలంగాణలో బలమైన నాయకులు కావడంతో, పదవులు దక్కని వారంతా తీవ్ర అసంతృప్తికి గుర వుతారని , అటువంటి వారిని బిజెపి వైపు తీసుకురావాలనే ఆ పార్టీ ప్లాన్ గా కనిపిస్తోంది.
ఎలాగు ఈ విషయంలో టీఆర్ఎస్ లో ప్రకంపనాలు చోటుచేసుకుంటాయి కాబట్టి , సదరు అసంతృప్త నేతలతో పాటు టీఆర్ఎస్ కు ఆర్థిక అండదండలు అందిస్తున్న పారిశ్రామికవేత్తలను సైతం బీజేపీ లో చేర్చుకునే ఆలోచన తో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమానికి తెర తీసినట్లు సమాచారం.కొంతమంది ఇది కీలక నాయకులను బిజెపిలో చేర్చుకునే విషయంలో కేంద్ర బిజెపి పెద్దల ద్వారా ఒత్తిడి పెంచుతున్నట్లుగా రాజకీయ గుస గుసలు మొదలయ్యాయి.పార్టీలో చేరే వారికి రాబోయే రోజుల్లో ఏమేమి పదవులు ఇస్తాము ? మరేవిధమైన ప్రాధాన్యం కల్పిస్తామో అనే విషయాన్ని హైలెట్ చేసి మరీ చెబుతున్నారట.ఫైనల్ గా టిఆర్ఎస్ ను బలహీనం చేయడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ టార్గెట్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.