తెలంగాణ బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.ఏదో ఒకరకంగా తెలంగాణ లో టీఆర్ఎస్ కు ధీటుగా బలం పెంచుకుని అధికార పార్టీ గా మారాలనే తపన తో ఉంది.
అందుకే వీలైనంత ఎక్కువగా వలసలపై దృష్టి పెట్టింది.తాజాగా ఈ చేరికలను మరింత ప్రోత్సహించేందుకు బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు కొత్తగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీకి చైర్మన్ గా బిజెపి సీనియర్ నాయకుడు ఇంద్రసేనారెడ్డి ని నియమించారు.అలాగే ఈ కమిటీలో స్వామిగౌడ్, రవీందర్ నాయక్ , చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ ఎం రామచంద్ర రావు తో పాటు, మరో ఇద్దరిని సభ్యులుగా నియమించారు. ఎవరైనా బిజెపిలో చేరాలనుకుంటే ముందుగా ఈ కమిటీని సంప్రదించాల్సి ఉంటుంది.అలా చేరే వారితో చర్చలు జరపడం , వారి నేపథ్యం, బలా బలాలు అన్నిటిని తెలుసుకోవడం మొదలైనవన్నీ ఈ కమిటీ చేస్తుంది.
ఆ తర్వాత వారిని చేర్చుకోవాలా వద్దా అనే విషయంపై అంచనా వేసి పార్టీ నాయకత్వానికి ఈ విషయాలను తెలియజేస్తుంది.ముందుగా ఈ కమిటీ ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల పై దృష్టి పెట్టింది.
ఈ నెల 19న తెలంగాణ ఎస్సీ నియోజకవర్గాల పై బిజెపి నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు.ఈ ఎస్టీ నియోజకవర్గాలు సమన్వయ కమిటీకి చైర్మన్ గా గరికపాటి మోహన్ రావును నియమించారు.
చాడ సురేష్ రెడ్డి, కటకం మృత్యుంజయం, కూనా శ్రీశైలం గౌడ్ ఇందులో సభ్యులుగా ఉంటారు.ఈ సమావేశానికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ హాజరు కాబోతున్నారు.రిజర్వడ్ నియోజకవర్గాలపై ముందుగా ఫోకస్ పెట్టి తర్వాత అన్ని నియోజకవర్గాలలోనూ పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చేసుకునేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.అయితే ఈ విషయంలో తెలంగాణ బిజెపి నేతలు ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.