తెలంగాణలో బిజెపి బలపడుతున్నట్టుగా కనిపిస్తుండడంతో, ఆ పార్టీ అగ్ర నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.ఎలాగూ వచ్చే ఎన్నికల నాటికి టిఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత బాగా పెరుగుతుందని, ఎలాగూ అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఉనికి లో ఉండదని అంచనా వేస్తున్న బీజేపీ పెద్దలు, ఇదే సరైన సమయంగా భావించి బిజెపిలో కొత్త ఊపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించింది.ఆయన ద్వారానే తెలంగాణ బీజేపీ బండి ని పరుగులు పట్టించాలని చూస్తున్నారు.
ఆయన నియామకం పూర్తయ్యి అప్పుడే వంద రోజులు అవుతోంది.ఈ వంద రోజుల్లో పార్టీకి మైలేజ్ తీసుకువచ్చే విధంగా, ఆయన అనేక కార్యక్రమాలను చేపట్టారు.
కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది అంటూ బండి సంజయ్ విమర్శలు చేస్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేశారు.
ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎప్పటికప్పుడు హైలెట్ చేస్తూ బీజేపీకి జనాల్లో ఆదరణ పెరిగే విధంగా చేశారు.
దీంతో పార్టీ అగ్రనేతలు సైతం బండి సంజయ్ నాయకత్వంపై ఇప్పుడు బాగా నమ్మకంతో ఉన్నారు.అందుకే ఆయనకు పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చారు.దీంతో ఆయన కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకుని, పార్టీని పరుగులు పెట్టించాలని చూస్తున్నారు. బిజెపి అధ్యక్షుడిగా తాను నియామకం అయినప్పటికీ, ఇంకా పాత కమిటీలే కొనసాగుతుండటంతో, మొత్తం అన్ని కమిటీలను రద్దు చేసి పూర్తిగా తన అదుపాజ్ఞల్లో ఉండే వ్యక్తులతో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన చూస్తున్నారు.
ప్రస్తుతం కమిటీలో 28 మంది సభ్యులు ఉండగా, ఇకపై ఆ సంఖ్యను తగ్గించాలని చూస్తున్నారు.పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాలను కూడా పూర్తిగా మార్చి, దాదాపు 30 విభాగాలకు సంబంధించి పూర్తిగా కొత్త వారిని నియమించాలని, పార్టీలో యాక్టివ్ గా ఉంటూ, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారినే ఈ కమిటీ లోకి తీసుకోవాలని బండి సంజయ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
బండి సంజయ్ నిర్ణయాలకు కేంద్ర బీజేపీ పెద్దలు కూడా అన్ని విధాలుగా మద్దతు ఇస్తుండడంతో, ఆయన పూర్తి స్వేచ్ఛగా కొత్త కమిటీ నియమించుకుని, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.మరికొద్ది రోజుల్లోనే కొత్త కమిటీని నియమించే విషయంపై పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతోంది.