ఎన్నికల సమయంలో, అధికారంలోకి వ చ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నారు? తెలంగాణలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని, ఎవ్వరినీ తీసేయబోమని, భయపడాల్సిన పనిలేదని చెప్పారు.కేసీఆర్ ఈ ప్రకటన చేశాక ఉస్మానియా విశ్వవిద్యాలయం భగ్గుమంది.
విద్యార్థులు పెద్దెత్తున ఆందోళన చేశారు.కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే తమకు ఉద్యోగాలు ఎట్లా అని ప్రశ్నించారు.
వాళ్లను పర్మినెంట్ చేయొద్దని,తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ గొడవ ఇలా సాగుతుండగానే ఈరోజు ప్రభుత్వం ‘ఎక్కువ సిబ్బంది’ అనే పేరుతో నలభై మూడు మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది.
వీరంతా తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలోని జిల్లా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది.వీరిని తొలగించాలని ఉత్తర్వులు రాగానే ఉద్యోగులు ఒక్కసారి షాక్ తిన్నారు.
విషాదకరమైన విషయం ఏమిటంటే వీరికి గత ఆరు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడంలేదు.ఇప్పుడేమో తీసేశారు.
ఏనాటికైనా ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయనే ఆశతో చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నామని, ఇప్పుడు హఠాత్తుగా తీసేయడంతో రోడ్డున పడ్డామని, తమ భవిష్యత్తు ఏంటని ఆవేదన చెందుతున్నారు.వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల సమయంలో ఎక్కువమందిని నియమించారట…! దీంతో అదనంగా ఉన్నట్లు తేలినవారిని తీసేశారట…! ఈ చర్య కేసీఆర్ ప్రభుత్వంపై ప్రభావం చూపిస్తుంది.
రాబోయే రోజుల్లో మరింతమంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తీసేసే అవకాశం ఉంది.కాంట్రాక్టు ఉద్యోగుల్లో భయం మొదలైంది.
ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు.ప్రతిపక్షాలకు ముఖ్యంగా వామపక్షాలకు ఓ ఆయుధం దొరికినట్లే.