తెలంగాణాలో చాపకింద నీరులా విస్తరిస్తూ ముందుకు వెళ్తున్న బీజేపీ ని చూసి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కంగారు మొదలయ్యినట్టే కనిపిస్తోంది.ఇప్పటివరకు ఆ పార్టీని పెద్దగా సీరియస్ గా తీసుకొని టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు మాత్రం ఎక్కడలేని కంగారుపడుతోంది.
తెలంగాణ ప్రజలు బీజేపీని పెద్దగా ఆదరించారని, కేవలం ఒకటి రెండు సీట్లకే ఆ పార్టీ పరిమితం అయిపోతుందని భావించిన ఆ పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు చూసాక షాక్ తిన్నారు.ఆ తరువాత బీజేపీ లోకి వలస వెళ్లే నాయకుల జాబితా రోజు రోజుకి పెరిగిపోతుండటంతో బీజేపీని మరీ అంత తేలిగ్గా తీసుకోవాల్సిన పరిస్థితి లేదనే విషయాన్నిఆలస్యంగానైనా గుర్తించింది.
టీఆర్ఎస్ కు బీజేపీ రాజకీయ ప్రత్యర్థిగా మారుతుందనే విషయాన్ని ఎవరూ ఊహించలేకపోయారు.ఎందుకంటే బీజేపీ అగ్ర నాయకులతో కేసీఆర్ సన్నిహితంగా ఉండడం, కేసీఆర్, కేటీఆర్ వీలైనప్పుడల్లా ప్రధానిని కలవడం, వారు ఎప్పుడంటే అప్పుడు ప్రధాని అపాయింట్మెంట్ దొరకడం ఇవన్నీ వారు రాజకీయ మిత్రులని విషయాన్ని అందరికి తెలియజేసింది.తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు పూర్తయ్యే వరకూ బీజేపీ, టీఆర్ఎస్ ఒకరికి ఒకరు బాగానే సహకరించుకున్నారు.కానీ పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఒక్క సారిగా పరిణామాలు మారిపోయాయి.
టీఆర్ఎస్ కంచుకోటలుగా ఉన్న నాలుగు పార్లమెంట్ సీట్లలో విజయం సాధించడంతో అందరూ షాక్ తిన్నారు.అదే ఉత్సాహంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో అధికారం దక్కించుకుంటామనే ధీమా బీజేపీలో కనిపిస్తోంది.
టీఆర్ఎస్ పార్టీతో పాటు విపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలపై దృష్టిసారించాయి.ఇప్పటికే వలసలతో కుదేలైపోయిన కాంగ్రెస్ కంటే బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది.ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలను ఆకర్షిస్తోన్న బీజేపీ టీఆర్ఎస్ నాయకులపైనా ఫుల్ ఫోకస్ పెట్టింది.ఇటీవలే మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో పాటు రామగుండానికి చెందిన అనేకమంది కార్పొరేటర్లు బీజేపీలోకి జంప్ చేయడం టీఆర్ఎస్ కు మింగుడుపడడంలేదు.
ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక మున్సిపాలిటీలలో పట్టు సాధించడంతో పాటు రాష్ట్రం వ్యాప్తంగా అర్భన్ ఏరియాల్లో పట్టు సాదించేందుకు ప్రధానంగా దృష్టి సారించింది.ఈ పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ ని తక్కువగా అంచనా వేస్తే చేదు ఫలితాలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.