‘బ్లూ వేల్ చాలెంజ్’ అనే ఆన్లైన్ సూసైడ్ గేమ్ గుర్తుంది కదా ! ఆ గేమ్ ఆడి ఇప్పటికే చాలామంది చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.రష్యాలో ప్రారంభమైన ఈ గేమ్ ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మనదేశంలో కూడా అనేక మంది చిన్నారులు ఈ గేమ్ బారిన పడడంతో ప్లే స్టోర్ నుంచి ఈ గేమ్ను తీసేయాలంటూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.అయితే ఈ గేమ్ చాపకింద నీరులా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా … కర్ణాటకలోని కలబురిగికి చెందిన 12 యేళ్ల సమర్థ్ అనే చిన్నారి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.ఏడో తరగతి చదువుతున్న సమర్థ్ చిన్నవయస్సులోనే ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆరా తీస్తే కొన్నాళ్లుగా మొబైల్ఫోన్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నాడని, ఇంటర్నెట్లో బ్లూ వేల్ గేమ్ ఆడుతున్నాడని తెలిసింది.దాని మాయలో పడి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.
గత వారం రోజులుగా పరధ్యానంగా ఉన్న సమర్థ్ ఇటీవలే ఓ ఇనుప స్టాండ్ను కొనివ్వాలని ఇంట్లో వారిని అడిగాడు.స్టాండ్ ఎందుకని అడిగితే ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం అని చెప్పాడు.దీంతో తల్లిదండ్రులు స్టాండ్ను తీసుకొచ్చారు.సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తనకు పానీపూరి కావాలని మారాం చేస్తే తల్లి బయటకు వెళ్లి వచ్చేలోగా సమర్థ్ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు.
చాలాకాలంగా మొబైల్తోనే గడుపుతున్న సమర్థ్ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతాడని అనుకోలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.