భారత సంతతి సిక్కు కుటుంబానికి చెందిన 16 ఏళ్ల బాలుడు రిష్మీత్ సింగ్ హత్య వ్యవహారం బ్రిటన్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి పోలీసులు పురోగతి సాధించారు.
అనుమానితుడిగా భావిస్తోన్న యువకుడిని అరెస్ట్ చేసి శుక్రవారం వింబుల్డన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.మరోవైపు ఇదే కేసులో మంగళవారం అదుపులోకి తీసుకున్న 19 ఏళ్ల యువకుడు బెయిల్ పొందాడు.
కాగా.ఒక అల్లరి మూకల గుంపుతో జరిగిన గొడవకు సంబంధించి నవంబర్ 24 రాత్రి పోలీసులకు సమాచారం అందడంతో వారు సౌతాల్లోని రాలీ రోడ్కు చేరుకున్నారు.
లండన్ అంబులెన్స్ సర్వీస్ (ఎల్ఏఎస్) నుంచి పారామెడిక్స్తో పాటు అధికారులు కూడా అక్కడికి హుటాహుటిన వచ్చారు.అక్కడ తీవ్ర గాయాలతో పడివున్న రిష్మీత్ సింగ్ను కాపాడేందుకు ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ రిష్మీత్ సింగ్ అక్కడికక్కడే తుదిశ్వాస విడిచాడని పోలీసులు తెలిపారు.
అనంతరం అతని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.అయితే పోలీసులు ఎంతగా శ్రమించినా ఈ కేసులో చిక్కు ముడి వీడటం లేదు.
దీంతో ప్రజల సహకారం కోరారు.ఈ మేరకు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఆదివారం ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు.
రిష్మీత్ హత్య కేసులో సహాయపడే సమాచారం లేదా సీసీటీవీ ఫుటేజ్ వున్న వారు తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
ఘటన జరిగిన బుధవారం రాత్రి 9 గంటల తర్వాత రాలీ రోడ్ చుట్టు పక్కల ప్రాంతంలో సంఘటనను చూసినవారితో సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే ఎలాంటి ఆధారాలు వున్నా తక్షణం పోలీసులను సంప్రదించాలని పోలీసులు ప్రజలను కోరారు.అయితే అతని మిత్రుల కథనం ప్రకారం.
రిష్మీత్ సింగ్ వద్ద గుచ్చీ అనే ఖరీదైన బ్రాండ్ కంపెనీకి చెందిన బ్యాగ్ కోసమే హత్య జరిగిందని తెలుస్తోంది.సదరు బ్యాగ్ ఖరీదు కంటే కూడా కంపెనీ బ్రాండ్పై క్రేజ్ ఎక్కువట.
ఈ బ్యాగ్ దొంగిలించే క్రమంలోనే రిష్మీత్ సింగ్ను దుండగులు చంపి వుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు రిష్మీత్ హత్యలో పాల్గొన్న నేరస్తులను పట్టుకునేందుకు గాను పశ్చిమ లండన్ ప్రాంతంలోని స్థానికులతో కలిసి పనిచేస్తామని పోలీసులు తెలిపారు.