మీరందరూ లైఫ్ ఆఫ్ పై సినిమా చూశారు కదా.పడి సముద్రంలో చిక్కుకకుపోయిన ఒక కుర్రాడి కథ.
అది సినిమా.గ్రాఫిక్స్, గిమ్మిక్స్ అవీ ఉన్నాయి.
కానీ అలాంటి ఉత్కంఠ, భయానక ఉదంతం నిజ జీవితంలో జరిగితే.చేపల వేటపై ఆధారపడి జీవించే ఓ ఇండోనేసియా కుర్రాడు.
నడి సముద్రంలో 49 రోజులు గడిపాడు.ఎండకుఎండి, వానకు నాని.
తినడానికి తిండిలేక నానా తిప్పలు పడ్డాడు.అయినా కూడా బతకాలనే ధృడ సంకల్పంతో నేలను చేరాడు.
సులవేసికి చెందిన 19 ఏళ్ల అల్దీ నావెల్ అదిలాంగ్ పని సముద్రంలోనే.లంగరు వేసిన తెప్ప గుడిసెలో ఉండేవాడు.సాయంత్రం కాగానే అతడు అక్కడ దీపం పెట్టాలి.దీపపు కాంతికి చేపలు బిలబిలా వస్తాయి.అల్దీ పనిచేసే కంపెనీ వేటగాళ్లు వాటిని పట్టుకుపోతారు.అల్దీకి నెలకోమారు సరుకులు ఇచ్చి వెళ్తుంటారు.
జూలై 14 వరకు అతడి దినచర్య ఇదే.కానీ ఆ తర్వాత ఒక రోజు సముద్రంలో వీచిన పెనుగాలుల వల్ల గుడిసె కింద ఉన్న లంగరు తాళ్లు తెగిపోయాయి.తెప్ప గుడిసె కొట్టుకుపోయి 2,698 కి.మీ.వెళ్లిపోయింది.కనుచూపుమేర ఎక్కడా తీరం కనిపించలేదు.
అల్దీ గుడిసెలోని తిండిని పొదుపుగా తిన్నాడు.బట్టను నీటిలో తడిపి దాహం తీర్చుకున్నాడు.కొన్నాళ్ల తర్వాత తిండి అయిపోయింది.చేత్తో చేపలు పట్టుకుని , తెప్పకర్రలతో మంటవేసి చేపలను కాల్చుకుని తిన్నాడు.మధ్యమధ్యలో ఓడలు కనిపించేవి.అయినా ఆగేవి కావు.
అతడు పంపిన రేడియో సిగ్నళ్లు అందేవి కావు.అతనికి జీవితంపై ఆశపోయింది.
ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నాడు.కానీ అది పాపం అని విరమించుకున్నాడు.
దేవుణ్ని నమ్ముకున్నాడు.తన వద్ద ఉన్న రేడియో ద్వారా దగ్గర్లోని నౌకలకు ఎస్ఓఎస్లు పంపాడు.
ఎట్టకేలకు ఆగస్టు 31న పానామా నౌక ఒకటి అతని మొర ఆలకించింది.అతణ్ని కాపాడి జపాన్కు తీసుకెళ్లింది.
అక్కడి చికిత్సతో కోలుకుని ఈ నెల 8న స్వదేశానికి చేరుకున్నాడు.