ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో రాజకీయాలు అసక్తికర ములుపులు తిరుగుతున్నాయి.టికెట్ రేసులో మామ, కోడలు పోటీ పడుతుండడం అధికార టీఆర్ఎస్వర్గాలను ఆయోయమంలోకి నెడుతోంది.వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని మామ అంటుంటే… ఒకవేళ పార్టీనుంచి మామకు టికెట్ రాకుంటే తానే బరిలోకి దిగుతానని కోడలు అంటుండడం గమనార్హం.2014ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తీగల కృష్ణారెడ్డి విజయం సాధించారు.2009 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి తీగల, కాంగ్రెస్ నుంచి మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేశారు.ఆ ఎన్నికల్లో సబిత తీగలను ఓడించారు.
ఇక గత ఎన్నికల్లో సబితపై తీగల విజయం సాధించి….ఎప్పటి నుంచో అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటోన్న తన కోరిక నెరవేర్చుకున్నారు.
అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.అయితే ఆయన రాకను మొదటి నుంచి పార్టీలో ఉన్న పాత టీఆర్ఎస్ క్యాడర్ వ్యతిరేకిస్తోంది.పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న తమను కాదని తీగల కృష్ణారెడ్డికి గులాబీ బాస్ ప్రాధాన్యం ఇవ్వడాన్ని పాత క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది.గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన కొత్త మనోహర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించిన కప్పాటి పాండురంగారెడ్డి ఇప్పటికీ తీగలపై గుర్రుగానే ఉన్నారు.
అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్న కప్పాటి పాండు రంగారెడ్డిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇచ్చి పార్టీ అధిష్టానం సర్దిచెప్పే ప్రయత్నం చేసినా అది పెద్దగా పనిచేయకపోవడం గమనార్హం.పార్టీలో రెండుమూడు గ్రూపులు కొనసాగుతుండడంతో కిందిస్థాయి పార్టీ శ్రేణులు కూడా గందరగోళంలో పడిపోతున్నాయి.
ఇక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితారెడ్డి, మనోహర్రెడ్డి, పాండురంగారెడ్డిలు పోటీ పడుతున్నారు.
అయితే ఇక్కడ మాత్రం టికెట్ రేసులో మామా, కోడలు ఉండడంపై నియోజకవర్గంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.అనితారెడ్డి కూడా నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు.ఆర్ట్ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు దగ్గరయ్యేందకు ప్రయత్నం చేస్తున్నారు.ఆమె ఈ కార్యక్రమాల్లో తాను అసెంబ్లీ బరిలో ఉంటానన్న విషయాన్ని ఓపెన్గానే చెప్పేస్తున్నారు.
తీగల కృష్ణారెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లోనూ తానే బరిలోకి దిగుతానని చెబుతున్నారు.ఓ వైపు మనోహర్రెడ్డి, రంగారెడ్డిలతో పోటీ ఎదుర్కొంటోన్న తీగలకు ఇప్పుడు కోడలు కూడా ఇంటి పోరుగా మారింది.