జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా నల్లజాతీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.అప్పటి వరకు శ్వేతజాతి ఆగడాలను పంటి బిగువున భరించిన వీరిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
దీంతో తమకు న్యాయం చేయాలంటూ రోడ్ల మీదకు వస్తున్నారు.ఈ నేపథ్యంలో ముఖ గుర్తింపు, ముఖ కవళికల విశ్లేషణ సాఫ్ట్వేర్ను ఉపసంహరించుకుంటున్నట్లు టెక్ దిగ్గజం ఐబీఎం ఓ ప్రకటనలో తెలిపింది.
సామూహికంగా ప్రజలపై నిఘా ఉంచేలా, జాతిపరమైన వివరాలను సేకరించేలా, మానవ హక్కులను ఉల్లంఘించేలా ఉన్న సాంకేతికతను ఎవరు అందిస్తున్నా దానిని గట్టిగా వ్యతిరేకిస్తామని సంస్ధ సీఈవో అరవింద్ కృష్ణ స్పష్టం చేశారు.
జాతిపరమైన సమానత్వం కోసం విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవశ్యకతపై చట్టసభలకు ఆయన లేఖ రాశారు.
ముఖ గుర్తింపు సాంకేతికతను, కృత్రిమ మేధస్సును దర్యాప్తు సంస్ధలు ఎలా వినియోగించుకోవాలని దేశవ్యాప్త చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.మరోవైపు ఐబీఎం బాటలోనే అమెజాన్ సైతం ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత వినియోగాన్ని ఏడాది పాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత అమెరికాలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ప్రజలను ట్రాక్ చేయడానికి పోలీసులు, నిఘా విభాగాలు ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి.
అనుమానితులను గుర్తించడానికి ఈ విధానం బాగానే ఉపకరిస్తున్నప్పటికీ.ఇది దుర్వినియోగమయ్యే అవకాశం వుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీనిలో భాగంగా గతేడాది శాన్ఫ్రాన్సిస్కోతో పాటు అనేక అమెరికన్ నగరాల్లోని పోలీస్, ఇతర ప్రభుత్వ సంస్థలు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే అమెరికాలోని కొన్ని నగరాల్లో పోలీస్ వ్యవస్థలను నిషేధించాలంటూ వస్తున్న డిమాండ్లపై దేశాధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.
ఇతరుల్ని రక్షించడానికి పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని, అందువల్ల ఈ వ్యవస్థను రద్దు చేయడంగానీ.వారికి నిధులను నిలిపివేయడం గానీ ఉండబోదని ట్రంప్ తేల్చిచెప్పారు.దేశవ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.