దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసింది.కరోనా కేసులు తగ్గుముఖం పట్టి.
మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ మరో ఉద్ధృతికి కారణం కావచ్చని ఆందోళనలు మొదలయ్యాయి.ఈ క్రమంలో టీమ్ ఇండియా సౌతాఫ్రికాలో పర్యటన చేస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
డిసెంబర్ 15 నుంచి జనవరి 26 వరకు దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటించాల్సి ఉంది.ఈ తేదీల్లో 3 టెస్టులు, 3 వన్డేలు, 4 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి.
ఈ మ్యాచ్లు జొహన్నెస్ బర్గ్, కేప్ టౌన్, సెంచూరియన్, పార్ల్ లలో జరగనున్నాయి.
దక్షిణాఫ్రికాలో విజృంభించిన కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదిగా వైద్య విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా పర్యటనను ప్లాన్ చేసుకుంటాం అని బీసీసీఐ చెబుతోంది.సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ ఉన్నతాధికారులతో భేటీ అవుతామని బీసీసీఐ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అన్ని విషయాల గురించి చర్చించిన తర్వాతే పర్యటనపై ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది.
ప్రస్తుతం న్యూజిలాండ్తో టీమ్ ఇండియా టెస్ట్ మ్యాచ్లు ఆడుతోంది.ఈ సిరీస్ ముగిసిన తర్వాత డిసెంబర్ 9 లోగా దక్షిణాఫ్రికాకి టీమిండియా జట్టును పంపించాలని గతంలో బీసీసీఐ నిర్ణయించింది.కానీ నేటి పరిణామాల కారణంగా ఆ ప్లాన్ మార్చుకుంది.
జొహన్నెస్ బర్గ్, సెంచూరియన్ భారత క్రికెటర్లు బస చేయనుండగా.ఆ ప్రాంతాలకు సమీపంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది.
దాంతో టీమిండియా పర్యటన పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.ఒకవేళ ఆటగాళ్లను పంపించినా కనీసం మూడు నాలుగు రోజులు క్వారంటైన్ లో ఉంచాల్సిన పరిస్థితి.కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా బి.1.1.529 వేరియంట్ సంక్రమిస్తుంది.ఫలితంగా అక్కడికి వెళ్లకపోవడమే మేలనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.మరి ఈ పర్యటనను రద్దు చేస్తారా? లేదా? అనేది కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.