ఈ ప్రపంచంలో అనేక జీవరాశులు బతుకుతున్నాయి.చాలా జంతువులు అంతరించిపోయాయి.అలాగే ఎన్నో రకాల చెట్లు, ధాన్యాలు అనేవి అంతరించిపోయాయి.రాబోవు రోజుల్లో చాలా అంతరించిపోయే అవకాశం కూడా ఉంది.ఇలాంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో మానవుల జీవనం అగమ్యగోచరంగా మారే పరిస్థితి అనేది రానుంది.అందుకే చాలా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
అలాంటి బాధ్యతనే తన భుజాలపై పెట్టుకుని ఓ వ్యక్తి మోస్తున్నాడు.అతడు అంతరించిపోతున్న మొక్కలను కాపాడుతూ సేవ చేస్తున్నాడు.
అతడు చేస్తున్న ఆ కష్టానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు మంచి అవార్డును ఇచ్చారు.అతని పేరే నిరాల్ పటేల్.
చిన్నతనం నుంచి అతనికి బాధ్యత అనేది అలవడింది.
గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంత జిల్లాకు చెందిన నిరాల్ మొక్కలను ప్రాణం కంటే ఎక్కువగా చూస్తాడు.
దాదాపుగా 350 రకాల అరుదైన మొక్కలకు చెందిన విత్తనాలను అతడు ఉచితంగానే ఇవ్వడం విశేషంగా చెప్పొచ్చు.
నిరాల్ పటేల్ తానే సొంతంగా ఓ సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు.అందులో అంతరించిపోతున్న, అరుదైన మొక్కల్ని కాపాడుతూ వస్తున్నాడు.అతడు అరుదైన మొక్కలను, ఆ మొక్కల విత్తనాలను సేకరిస్తూ వస్తున్నాడు.
అంతేకాదు పలువురికి ఆ విత్తనాలను ఇస్తూ అండగా నిలుస్తున్నాడు.కరోనా టైమ్లో కూడా నిరాల్ చేస్తున్న సేవకు అరుదైన గౌరవం దక్కింది.
ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నప్పుడు నిరాల్ మాత్రం మొక్కలను సంరక్షిస్తూ మానవ జాతికి అరుదైన సంపదను పంచుతున్నాడు.
తన బాధ్యతను నిర్వర్తిస్తూనే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.ఇప్పటి వరకూ అతను కోటికి పైగా విత్తనాలను దేశ ప్రజలకు ఉచితంగా ఇవ్వడంతో ప్రభుత్వం నుంచి అతను పలు సత్కారాలను పొందాడు.29 ఏళ్ల నిరాల్ పటేల్ బనస్కాంతలోని పలన్పూర్లో నివాసం ఏర్పాటు చేసుకుని దంతెవాడలో మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.