ఈ రోజుల్లో చదువుకునేవారి కంటే చదువుకొనే వారి సంఖ్యే ఎక్కువయింది.విద్యావ్యాపారంగా మారిపోయిన తర్వాత విద్య పేదవారికి అందని ద్రాక్షగా మారింది.
అలా చదువుని కొనుక్కునే స్థోమతలేక,స్కూల్ ఫీజ్ కట్టలేకపోయిందా అమ్మాయి.దాంతో స్కూల్ నుండి గెంటేశారు .ఛాయ్ అమ్ముకునే తన తండ్రి ఫీజ్ కట్టలేడని అర్ధం అయింది.కానీ అంతటితో చదువుకి పుల్ స్టాప్ పెట్టలేదు.పట్టుదలగా చదివి ఇప్పుడు ఉన్నత చదువుల కోసం 3.8 కోట్ల రూపాయల స్కాలర్షిప్ను పొందింది.అసలు వివరాల్లోకి వెళితే.
ఉత్తర్ప్రదేశ్ లోని బులంద్షహర్కు చెందిన సుదీక్షా భాటి ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది.తండ్రి చాయ్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.ఒక్కరోజు ఛాయ్ అమ్మడం మానేసినా కుటుంబం గడవని పరిస్థితి.అలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం అనేది సుదీక్షకు కష్టంగా మారింది.ఓ ప్రయివేట్ స్కూల్ లో చదువుతున్న ఆమెను స్కూల్ యాజమాన్యం ఫీజు కట్టలేదని బయటకు నెట్టేసింది.దాంతో ప్రభుత్వ పాఠశాలలో చేరింది.గవర్నమెంట్ స్కూల్ అయితేనేమి.5వ తరగతిలోనే ఎంతో జ్ణానాన్ని సంపాదించుకుంది.తన తెలివితేటల్ని చూసి అబ్బురపడిన శివనాడార్ ఫౌండేషన్ తన చదువుకు తమ వంతు సాయం చేస్తూ వచ్చింది.
హైస్కూల్ చదువుకు వచ్చేసరికి సుధీక్ష పాల్గొనని పోటీ లేదు.ఎక్కడ ఏ పరీక్ష పోటీలు జరిగినా మొదట సుదీక్ష పేరు వినబడేది.పాల్గొన్న ప్రతి పరీక్షలో మొదటి స్థానం కైవసం చేసుకునేది.ఇంటర్ లో 98% మార్కులను పొంది అందరి మన్ననలను అందుకుంది.దీంతో అమెరికాలోని ప్రతిష్టాత్మక బాబ్సన్ కాలేజీ (మాసాచుసెట్స్)లో సుదీక్షకు చదువుకునే అవకాశం లభించింది.బాబ్సన్ కాలేజియే 3.8కోట్ల స్కాలర్ షిప్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది.ఇప్పుడు ఆ స్కాలర్ షిప్ సహాయంతోనే బాబ్సన్ కాలేజిలో చదువుకోవడానికి మాసాచుసెట్స్ వెళ్తుంది.
చదువు విలువ తెలిసిన సుదీక్ష గతంలో అమ్మాయిలకు చదువు చాలా ముఖ్యం అని కొన్ని ఆవగాహన కార్యక్రమాల్లో కూడా పాల్గొంది.