ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నాయకుల వలసల సీజన్ నడుస్తోంది.కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలోకి ఇతర పార్టీల నుంచి వలసలు సర్వ సాధారణం అయినా ఏపీలో మాత్రం ఇప్పటివరకు అధికార పార్టీలోకి పెద్దగా వలసలు కనిపించలేదు.
దీనికి భిన్నంగా బీజేపీలోకి చాలామంది నాయకులు క్యూ కట్టారు.దీనికి కారణం వైసీపీ అధినేత జగన్ పెట్టిన నియమ నిబంధనలతో పాటు ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించడమే కారణంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఇతర పార్టీల్లోని ద్వితియ శ్రేణి నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు.అయితే టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్యెల్యే ల్లో సుమారు పది పదిహేను మంది పార్టీ మారేందుకు చూస్తున్నారు.
అయితే వారు కనుక వైసీపీలోకి రావాలంటే పార్టీతో పాటు తమ ఎమ్యెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలనే నిబంధన జగన్ విధించారు.దీని కారణంగానే అంతా వెనకడుగు వేస్తున్నారు.
అయితే ఒకరిద్దరు మాత్రం జగన్ పెట్టిన షరతులకు సిద్దమే అంటూ వైసీపీ అధినేత జగన్ కు రాయబారాలు పంపుతున్నారు.తాజాగా టీడీపీ నుంచి ఓ ఎమ్యెల్యే వైసీపీలోకి వచ్చేందుకు సిద్దమయ్యారు.జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.దీంతో టీడీపీలో ఆందోళన మొదలయ్యింది.ఇది ఒకరితో ఆగదని ఒకరి తరువాత మరొకరు ఇలా అంతా క్యూ కట్టేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది .ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాత్రం తాను ఎమ్యెల్యే గా రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లి అక్కడి నుంచి తిరిగి పోటీ చేస్తానంటూ బాహాటంగానే చెబుతున్నారు.దీనికి జగన్ కూడా ఓకే అన్నట్టు ప్రచారం జరుగుతోంది.
గొట్టిపాటి రవి కుమార్ పార్టీ మారడానికి మరో కారణం కూడా ఉందట.
స్థానికంగా టీడీపీ సీనియర్ నాయకుడు కరణం బలరాం కొడుకు వెంకటేష్ తో ఈయనకు పొసగడం లేదు.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వీరి మధ్య తరుచూ వివాదాలు చోటుచేసుకుంటూ ఉండేవి.
స్వయంగా వీరిద్దరికి సర్ది చెప్పడానికి అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చేది.ఈ మధ్య కూడా బలరాం కొడుకు వెంకటేష్ తో విబేధాలు ఎక్కువవడంతో టీడీపీలో ఉంటూ అవమానాలు ఎదుర్కోవడం కంటే వైసీపీలోకి వెల్లడం బెటర్ అని రవికుమార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
స్థానికంగా రవి కుమార్ కు ప్రజాధారణ ఎక్కువగా ఉండడం, ఏపీలో వైసీపీ గాలి బలంగా వీచినా ఆయనకు ఉన్న సొంత ఇమేజ్ తో టీడీపీ తరుపున గెలవగలిగాడు.మళ్ళీ ఇప్పుడు పోటీ చేసినా గెలుపు తధ్యం అనే ధీమా ఉండడంతోనే రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లేందుకు ఆయన సిద్దపడుతున్నట్టు కనిపిస్తోంది.