రాజకీయంగా ఏపీలో ఊపు తెచ్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది.ప్రస్తుతం అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఆ బలం వైసీపీకి సరిపోవడంలేదు.
పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తూ ప్రత్యర్థి పార్టీలు తమపై చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు చేయడంలో వైసిపి ఇంకా టీడీపీ కంటే వెనుకబడే ఉంది.రానున్న స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు దక్కించుకోవాలంటే తమ ప్రధాన ప్రత్యర్థి టిడిపిని బలహీనం చేయాలని ప్రయత్నిస్తోంది.
దీనిలో భాగంగానే టిడిపి నుంచి ఓటమి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులను తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది.ఎప్పటి నుంచో టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా జగన్ పెట్టిన నిబంధనలు వారికి ఇబ్బందికరంగా మారాయి.
కానీ టిడిపిలో ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం వైసిపిలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.ఇప్పటికే టిడిపి లో కీలక నాయకులుగా ఉన్న తోట త్రిమూర్తులు వైసీపీలో చేరగా , విశాఖ జిల్లాకు చెందిన పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇంకా అనేకమంది తమతో నిత్యం టచ్ లో ఉన్నారని,సరైన సమయం చూసి వారంతా వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని వైసిపి నేతలు ప్రకటిస్తున్నారు.దసరా తర్వాత సుమారు పదిమంది వరకు టిడిపి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన వైసీపీలోకి సిద్ధంగా ఉన్నారట.
ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ జిల్లాల నుంచి తాజా మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది వైసీపీ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.అయితే వారికి జగన్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వేచి చూస్తున్నారు.
ముఖ్యంగా బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలు ఎక్కువ స్థాయిలో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట.అయితే వీరికి సరైన సమయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని జగన్ చూస్తున్నారు.అదే కాకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో అక్కడ క్లీన్ స్వీప్ చేయాలంటే చేరికలు తప్పనిసరని , ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకులు చేరిన తరువాత మిగతా వారిని ప్రాధాన్యం ఇచ్చి చేర్చుకోవాలని జగన్ చూస్తున్నారట.ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయి.
తమ పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లాలని చూస్తున్న నాయకులు ఎవరు అనేది ఆరా తీసే పనిలో ఆ పార్టీ ఉంది.