టీడీపీ జనసేన రెండు పార్టీలు ఒకే తానులో ముక్కలు, కలిసి ఉన్నా విడివిడిగా ఉన్నట్టు నాటకాలు ఆడుతూ రాజకీయం చేస్తున్నారు అంటూ అధికార పార్టీ వైసీపీ పదే పదే ఈ రెండు పార్టీల మీద విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.వైసీపీ ఎంతగా విమర్శలు చేస్తున్నా ఈ రెండు పార్టీలు ఆ విషయంలో పెద్దగా రియాక్ట్ అవ్వడంలేదు.
ఈ మధ్య జనసేన అధినేత పవన్ విశాఖలో చేపట్టిన ఇసుక దీక్షకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలకడంతో పాటు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తదితరులను పంపించింది.దీనిపై మరింతగా వైసీపీ నాయకులు నోటికి పనిచెప్పారు.
ఇక ఇవన్నీ మాములే అన్నట్టుగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి.ఇక ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇసుక కొరతపై దీక్ష చేపడుతున్నారు.
దానికి సంబంధించి ఈనెల 14న విజయవాడ వేదికగా 12 గంటల పాటు దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు.ఐదు నెలలు గడిచినా ప్రభుత్వం ఇసుక కొరతను నివారించడంలో విఫలం అయిందని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
విజయవాడ ధర్నాచౌక్లో నిర్వహించే ఈ దీక్షకు తెలుగుదేశం పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమానికి హజరయ్యేలా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు సంపాదించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజా బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసి దీక్షకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే కోరారు.
ఇసుక సమస్యపై ఎవరు దీక్ష చేసినా సంఘీబావం ఉంటుందన్న బీజేపీ చంద్రబాబు దీక్షకు కూడా అదేవిధంగా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది.అయితే టీడీపీ దీక్ష శిభిరంలో కూర్చునేందుకు బీజేపీ నేతలు ఇష్టపడలేదని తెలుస్తోంది.
అయినా ఫర్వాలేదు బీజేపీ పరోక్ష మద్దతు ఉంటే చాలు అన్నట్టుగా టీడీపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పుడు జనసేన మద్దతు కూడగట్టడం అత్యంత ముఖ్యమైన పనిగా టీడీపీ పెట్టుకుంది.ఎందుకంటే జనసేన మద్దతు ఉంటే ఆ దీక్షకు మరింత క్రేజ్ వస్తుందని టీడీపీ భావిస్తోంది.దీనిలో భాగంగానే పవన్ ను ఎలా అయినా దీక్ష శిబిరం కు రప్పించేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్తో టీడీపీ నేతలు ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది.దానిలో భాగంగానే ఈ రోజు పవన్ తో టీడీపీ నేతలు భేటీ అయ్యి ఈ విషయం మీద చర్చించబోతున్నట్టు సమాచారం.
అయితే తాను స్వయంగా టీడీపీ దీక్ష శిభిరంలో పాల్గొంటే తలెత్తే రాజకీయ పరిణామాలు అన్నిటిని పవన్ ముందుగానే లెక్కవేసుకుంటున్నారట.తాను ఒక వేళ ఆ దీక్షలో పాల్గొంటే అనవసర విమర్శలు ఎందుకు మూట గట్టుకోవడం తమ పార్టీ నేతలను అక్కడికి పంపిస్తే ఏ తలనొప్పి ఉండదు కదా అనే ఆలోచన కూడా పవన్ చేస్తున్నారట.
ఏమైనా ఈ రోజు పవన్ తో టీడీపీ నేతల చర్చలు పూర్తయితే కానీ ఈ విషయంలో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడంలేదు.