తెలంగాణాలో బోల్తాపడ్డ టీడీపీ ఏపీ లో ఆ ఫలితాలు రాకుండా చూసుకోవాలని చూస్తోంది.అందుకే సింపతీ ఓట్లను కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది.
దీనిలో భాగంగానే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చరిష్మాను ఉపయోగించుకునేందుకు చూస్తోంది.అందుకే … అమరావతి సమీపంలో భారీ ఎన్.టి.ఆర్.విగ్రహానికి శ్రీకారం చుడుతోంది.నిజానికి నాలుగేళ్లుగా ఈ విషయం చెబుతున్నారు.
కాని ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దీనికి సంబందించిన వార్తలు పెద్ద ఎత్తున మీడియా లో వస్తున్నాయి.
అమరావతి వద్ద నీరుకొండ కొండపై ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపాదించారు.ఈ డిజైన్ లను కూడా బాబు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.కొండపై 32 మీటర్ల ఎత్తున నిర్మించే భవనంపై 60 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ కాంస్యవిగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
మొత్తం 200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును పర్యాటక ఆకర్షక ప్రదేశంగా తీర్చిదిద్దనున్నారు.ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును పర్యాటకంగానే కాకుండా, వాణిజ్య కూడలిగాను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాజెక్టు నిర్వహణకయ్యే ఆదాయాన్ని సొంతంగా సమకూర్చుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇటీవలే గుజరాత్ లో సర్దార్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.అయితే… అప్పట్లో ఆ విగ్రహ ఏర్పాటుపై టీడీపీ భారీగా విమర్శలు చేసింది.ఒక విగ్రహం కోసం అంతా ఖర్చా అని విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవ్వడం అనేక విమర్శలపాలవుతోంది.ఈ విగ్రహ నిర్మాణానికి రూ.406 కోట్ల ఖర్చు కానుందని సమాచారం .