రాజకీయాల్లో కాస్తో కూస్తో కాదు చాలా ఇబ్బందులే ఎదుర్కొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని ఎప్పటికైనా అధికారంలోకి తీసుకు రాగలను అనే నమ్మకాన్ని నమ్మకంగా చెబుతున్నారు.ఏదో ఒక అద్భుతం జరుగుతుందని, జనసేన సొంతంగానో, పొత్తుల ద్వారానో అధికారంలోకి రావడం పక్కా అనే విషయాన్ని పవన్ నమ్మకంగా పార్టీ శ్రేణులకు చెబుతూనే వస్తున్నారు.2019 ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓటమి చెందిన తరువాత బీజేపీతో కలిసి అడుగులు వేస్తున్న పవన్ ఆ పార్టీ తమ విషయంలో వ్యవహరిస్తున్న తీరు పైన అసంతృప్తితోనే ఉన్నారు.మొదట్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ పవన్ కు ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తూ వచ్చేవారు.
అన్ని విషయాల్లోనూ కలుపుకుని వెళ్తూ, ఉమ్మడిగా పోరాటాలు, అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చేవారు.ఎప్పుడైతే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి జనసేన కు ఇబ్బందులు తలెత్తినట్లు కనిపిస్తున్నాయి.
పూర్తిగా బీజేపీని బలోపేతం చేసే ఉద్దేశంతో సోము వీర్రాజు ముందుకు వెళ్తూ, జనసేనను పట్టించుకోనట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు.ఇదే జనసైనికులకు సైతం ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.
బిజెపి తమ విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తున్నా, పవన్ ఎందుకు నోరు మెదపడం లేదని చాలా కాలంగా ఆ పార్టీ నేతల్లో ఆగ్రహం ఉంది.అయితే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, ఎప్పటికప్పుడు వీటిని సర్దుకుపోతూ వస్తున్నారు.ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది.కానీ బిజెపి నేతలు ఎవరు టిడిపితో మళ్లీ పొత్తు పెట్టుకునేందుకు ఇష్టపడడం లేదు.గతంలో టిడిపి బిజెపి పొత్తు ఉన్న సమయంలో తలెత్తిన పరిణామాలను బీజేపీ నేతలు ఇప్పటికీ మర్చిపోవడం లేదు.అందుకే టిడిపిని వీలైనంత దూరంగా పెడుతున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు జనసేన తో అయినా పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ఈమేరకు పవన్ వద్దకు రాయబారాలు పంపుతున్నట్లు తెలుస్తోంది.
అయితే వీటన్నింటిని లెక్కలు వేసుకుంటున్న పవన్ బీజేపీతో ఇదే విధంగా పరిస్థితి ఉంటే, అవసరమైతే టిడిపితో పొత్తు పెట్టుకుని అధికారం దక్కించుకోవాలనే ఆలోచనలు ఉన్నారట.ఏది ఏమైనా బిజెపి తో వ్యవహారం బెడిసి కొడితే టిడిపిని మరో ఆప్షన్ గా పవన్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
అందుకే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల విషయంలో పవన్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తున్నారు.ఇక్కడి నుంచి బిజెపి తన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తుండగా, జనసేన సైతం తిరుపతిలో తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తాడు అనే సంకేతాలు బీజేపీకి ఇస్తోంది.
బిజెపి జనసేన బంధం తేలాలంటే తిరుపతి ఉప ఎన్నికల వరకు వేచి ఉండాల్సిందే.