తెలుగుదేశం పార్టీలు సీనియర్ నాయకులకు కొదవే లేదు.పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారు, చంద్రబాబుతో కలిసి మొదటి నుంచి అడుగులు వేసిన వారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే, ప్రతి నియోజకవర్గంలోనూ పెద్దఎత్తున సీనియర్ నాయకులు ఉన్నారు.
వారు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద పెద్ద పదవులు అనుభవించారు.పార్టీ పదవుల్లోనూ కీలక స్థానాల్లో ఉన్నారు.
వీరంతా రిటైర్మెంట్ వయసు దాటి పోయిన వారే.దాదాపు చంద్రబాబు వయసు తో సమానం గా ఉన్నవారు అనేకమంది.
వీరి వల్ల పార్టీకి ఇప్పుడు ప్రయోజనం ఏమైనా ఉందా అంటే లేదు అన్నట్లుగానే పరిస్థితి నెలకొంది.వీరంతా 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన వారే.
మరికొంత మంది పార్టీ పదవుల్లో కీలకంగా ఉన్న, ప్రత్యక్ష ఎన్నికల్లో వరుసగా పోటీ చేస్తూ ఓటమి చెందిన వారే.వీరి రాజకీయాలు పార్టీ నేతలతో పాటు జనాలకు మొహం మొత్తినా, బాబు మాత్రం వీరిని వదిలిపెట్టడం లేదు.
వారు కాకపోతే వారి వారసులు అన్నట్టుగా పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.ఈ పార్టీ సీనియర్ నేతలకు జనాల్లో పట్టు పూర్తిగా తగ్గిపోయింది.వీరు మాట వినే వారు కరువయ్యారు ఈ విషయం ఇటీవల జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికలతో పాటు 2019 సార్వత్రిక ఎన్నికలు రుజువు చేశాయి.ఇక వీరి వారసుల పరిస్థితి ఇదే విధంగా ఉంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో చూసుకుంటే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు, నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కృష్ణ జిల్లాలో వర్ల రామయ్య, రాజేంద్ర ప్రసాద్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది నేతలే ఉన్నారు.కనీసం గ్రామ స్థాయిలో ప్రభావం చూపించలేని నాయకులు సైతం టీడీపీ లో పెద్ద పెద్ద పదవులే అనుభవిస్తున్నారు.
వీరి వల్ల ఇప్పుడు పార్టీకి ఉపయోగం కనిపించడం లేదు.
మరో వైపు చూస్తే అధికార పార్టీ వైసీపీ లో కాని, జనసేన పార్టీలో కానీ యువ నాయకుల సందడి ఎక్కువగా ఉంది .వారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడంలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు.కానీ ఉనికి కోసం ఆరాటపడుతున్న టీడీపీ పార్టీ పదవుల్లో ప్రజల్లో బలం లేని , జనాల నాడి పసిగట్టలేని నాయకులకు ప్రాధాన్యం ఇచ్చి మరిన్ని ఇబ్బందులు పడుతోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.