తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుంటాము అనే నమ్మకంతో ఉంటూ వచ్చింది.గ్రామస్థాయి నుంచి ఆ పార్టీకి పొత్తు ఉండడం, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోంది అనే అంచనా, ముఖ్యంగా ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తారు అనే అంచనా ఇలా ఎన్నో కారణాలతో, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా వస్తాయని తెలుగుదేశం పార్టీ అంచనా వేసింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారి గా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళకూడదని వైసిపీ ప్రయత్నించిన సమయంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్లాల్సిందే అని పట్టు పట్టింది.
నిమ్మగడ్డకు అనుకూలంగా ఆ పార్టీ తరఫున ప్రకటనలు వెలువడ్డాయి.
చివరకు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఈ ప్రక్రియలో భాగంగా మొదటి విడత ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.దీంట్లో వైసిపి సానుభూతిపరులు ఎక్కువగా గెలుపొందడం, టిడిపి ప్రభావం అంతంత మాత్రంగా ఉన్నట్టుగా తేలిపోయింది.
సుమారు 500 పంచాయతీలు వైసిపికి అనుకూలంగా ఏకగ్రీవం అయ్యాయి.మొదటి విడతలో 3,249 పంచాయతీల్లో ఎన్నికలు జరగగా , అందులో 500 పంచాయతీల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది.
చాలా చోట్ల ఏకగ్రీవాలు జరగకుండా ఎన్నికలు జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాడి సక్సెస్ అయ్యింది.అక్కడ కూడా ఫలితాలు వైసిపికి అనుకూలంగా రావడంతో తెలుగుదేశం పార్టీ వ్యూహం బెడిసి కొట్టినట్లు అయింది.
ఇక రెండో విడత ఫలితాలు కూడా వైసిపికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నాయనే లెక్కలు బయటకు వస్తున్నాయి.దీంతో తెలుగుదేశం పార్టీలో ఆందోళన కలిగిస్తున్నాయి .వైసీపీ ప్రభుత్వం పై జనాల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరిగిందని, తెలుగుదేశం పార్టీకి గతంతో పోలిస్తే ఆదరణ పెరిగిందని ,ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జగన్ నిర్ణయాలు ప్రజలలో అంతగా ప్రభావం చూపించలేదని, తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తాయని తెలుగుదేశం పార్టీ అంచనా వేసినా, చివరకు ఆ వ్యూహం బెడిసి కొట్టడం, జగన్ ఇప్పుడు స్థానిక పోరులో హీరోగా నిలవడం వంటివి టిడిపి అధినేత చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు.