తమకు ఎప్పుడు ఏదో ఒక పదవి ఉండాలని రాజకీయ నాయకులు ఆరాటపడుతుంటారు.అందరికి ఎమ్యెల్యే, ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉండకపోవడం వల్ల ఆ లోటును నామినేటెడ్ పోస్ట్ లు ద్వారా పార్టీలు భర్తీ చేసుకుంటూ ఉంటాయి.
అధికార పార్టీ నాయకులూ కూడా తమకు నామినేటెడ్ పోస్ట్ ఎప్పుడు దక్కుతుందా అన్నట్టు ఎదురుచూపులు చూస్తుంటారు.అయితే ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ టీడీపీ ఎన్నికల సంగ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్ పోస్టుల భర్తీకి తెర తీసింది.
అయితే ఆ నామినేటెడ్ పోస్ట్లు తీసుకోవడానికి నాయకులు వణికిపోతున్నారు.దీనికి పెద్ద కారణం కూడా ఉంది.
అసెంబ్లీ ఎన్నికలకు మహా అయితే ఆరునెలల గడువు మాత్రమే ఉంది.ఎన్నికల్లో జయాపజయాలు ఎలా ఉంటాయో తెలియదు.ప్రస్తుతం ఉన్న వాతావరణంలో జగన్ పాదయాత్రకు జనం నీరాజనం పడుతుండడం, అలాగే గత ఎన్నికల్లో కాపు కుల ఓట్లను తెలుగుదేశానికి వేయించడంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కల్యాణ్ సొంత పార్టీతో బరిలో పోటీగా ఉండడం తెలుగుదేశానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.ఇటువంటి క్లిష్ట సమయంలో నామినేటెడ్ పదవులు తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో కోట్ల రూపాయల ఖర్చును తమ నెత్తిన రుద్దుతారని నాయకులు భయపడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఖర్చును ఇలాంటి నామినేటెడ్ పోస్టుల్లోని వారి ఖాతాల్లోకి వేయనున్నారని, ఒక్కోరు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ తరఫున ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు.అలాంటి షరతులు విధించే చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.
ఖర్చు అంటే ఏదో సాదాసీదాగా ఉండదని కోట్ల రూపాయలు పెట్టాల్సి రావొచ్చని సమాచారం.దీంతో ఇప్పుడు పదవులు పొందిన వారిలో దడ మొదలైందట.
తమను కొన్నాళ్ల కిందటే ఈ పదవుల్లో నియమించి ఉంటే వసూళ్లు చేసి పార్టీ తరఫున ఖర్చు పెట్టగలిగే వాళ్లమని.తీరా ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తమకు పదవులు ఇచ్చారని వారు లబోదిబోమంటున్నారు.