రైతు, జాతి వ్యతిరేక వ్యవసాయ నూతన చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ చట్టం తేవాలని, కార్మికుల సంక్షేమాన్ని కాలరాసే కార్మిక కోడ్ లను రద్దు చేయాలని, విశాఖ ప్రైవేటీకరణ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ” సంయుక్త కిసాన్ మోర్చా ” పిలుపు మేరకు సెప్టెంబర్ 27న జరిగే భారత్ బంద్ కు మద్దతిచ్చి భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి వివిధ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది.మంగళవారం ఆత్మకూరు లో గల టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని వెళ్లి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయడు కలిసి మద్దతు కోరారు.
దీనిపై ఆయన స్పందిస్తూ బంద్ కు పూర్తి మద్దతు ఇస్తామని ఇప్పటికే పార్టీ తరఫున ప్రకటన విడుదల చేశామని చెప్పారు.ఆ తర్వాత వైసీపీ కార్యాలయానికి వెళ్ళి ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కలిసి మద్దతు కోరారు.
దీనిపై వారు స్పందిస్తూ పార్టీ అధినేత దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ ను ఫోన్ ద్వారా సంప్రదించగా ఆలోచించి నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు.
ఆన్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ పోతిన రాము బంద్ కు మద్దతు తెలియజేశారు.ఇప్పటికే వామపక్షాలు మద్దతు తెలియజేశాయి.రాజకీయ పార్టీలతో పాటు చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర జిల్లా సంఘాల నాయకులు సాయి, రమేష్ బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.కేశవరావు, మల్నీడు యలమందారావు, వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకటగోపాలకృష్ణారవు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య పాల్గొన్నారు.