టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేయాలని డిసైడ్ అయిపోయారు.ఏపీ అంతటా నాలుగువేల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి జగన్ రికార్డును బద్దలు కొట్టి, టిడిపిని 2024 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో లోకేష్ ఉన్నారు.
ఇప్పటికీ పాదయాత్రకు సంబంధించిన కసరత్తును ఆయన చేపట్టారు.మరో 50 రోజుల్లో ఆయన పాదయాత్ర సిద్ధమవుతుంది.
ఈ యాత్రను టిడిపి సైతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఇప్పటికే చంద్రబాబు దీనికి సంబంధించిన వ్యూహాలు రచించే పనిలో ఉన్నారు.
పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధం అవుతుంది.ఎక్కడికక్కడ లోకేష్ యాత్రకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టీ నాయకులందరినీ బాబు అలెర్ట్ చేస్తున్నారు.
2019 ఎన్నికలకు ముందు జగన్ కు ఏ స్థాయిలో అయితే పాదయాత్ర ద్వారా గ్రాఫ్ పెరిగిందో, అంతకంటే ఎక్కువ స్థాయిలో లోకేష్ గ్రాఫ్ పెంచే విధంగా అన్ని జాగ్రత్తలు బాబు చేపట్టారు.పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఈ యాత్రకు సంబంధించి ఆర్థికపరమైన అంశాలు చర్చనీయాంశం గా మారాయి.
ముఖ్యంగా టిడిపి జిల్లా అధ్యక్షులు ఈ విషయంలో ఆందోళనలో ఉన్నారట.ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారికి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, ఇప్పుడు పాదయాత్ర బాధ్యతలు పూర్తిగా జిల్లా అధ్యక్షులకు బాబు అప్పగించడంతో ఈ యాత్రను ఏ విధంగా సక్సెస్ చేయాలనే టెన్షన్ వారిలో పట్టుకుందట.
ముఖ్యంగా పాదయాత్రకు సంబంధించిన ఖర్చు విషయంలో ఎవరు భరిస్తారనేది స్పష్టత లేకపోవడంతో, ఆ భారం తమపై పడుతుందేమో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.గతంలో చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో కీలకమైన పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఆర్థికంగా సహకారం అందించారు.అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో, జిల్లా అధ్యక్షులపైనే ఆ భారం వేస్తారేమో అన్న టెన్షన్ వారు కనిపిస్తోంది.పాదయాత్ర ఖర్చు భరించే స్తోమత కొంతమంది జిల్లా నాయకులకు ఉన్నా, తమకు టికెట్ కేటాయించే అవకాశం లేకపోవడంతో, భారీగా సొమ్ములు ఖర్చుపెట్టినా ప్రయోజనం ఏముంటుందనే ప్రశ్న వారి నుంచి ఎదురవుతుంది.
లోకేష్ పాదయాత్రను బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, ఈ విషయంలో తమపై పడే భారంను తలచుకుని నాయకులు కంగారు పడిపోతున్నారట.