కడప జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ పరిధిలో ఉన్న ముగ్గురాయి గనుల్లో ఈ నెల 8న జరిగిన పేలుళ్ల సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.అయితే ఈ క్వారీ నిర్వాహకుడు వైసీపీ నేత కావడం కూడా రాజకీయ చర్చకు దారితీసింది.
ఈ ఘటనలో మరణించిన వారి మృదేహాలు రక్తం ముద్దలుగా తప్ప, అవయవాలకు రూపురేఖలే లేకుండా పోయాయి.ఇంతటి దారుణమైన మరణాలను పొందారు ఈ క్వారీలో పనిచేసే కార్మికులు.
ఇదిలా ఉండగా ఈ ప్రమాద ఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.ఈ క్రమంలో జాయింట్ కలెక్టర్ గౌతమి క్వారీ రద్దు కోసం ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నట్టు తెలిపారు.
ఇక ఈ ప్రమాదం పై దర్యాప్తు చేయడానికి జేసీ సారథ్యంలో ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా రంగంలోకి దిగి విచారణ చేపట్టింది.ఈ నేపధ్యంలో క్వారీ నిర్వాహకులు నాగేశ్వరరెడ్డి, రఘునాథరెడ్డి, వైఎస్ ప్రతాపరెడ్డిలను ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు చెబుతున్న అధికారులను, టీడీపీ వర్గాలు విమర్శిస్తూ, అసలు లీజుదారైన వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.కాగా ఈ విషయంలో ప్రభుత్వం కనుక స్పందించకుండా, ఘటనకు బాధ్యులైన వారికి తగిన శిక్ష విధించకుండా ఉంటే మాత్రం కోర్టుకు వెళ్తామని హెచ్చరిస్తుందట టీడీపీ.
మరి బాధితులకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో చూడాలి.