ఏపీలో ఇప్పటికే మూడు రాజధానులు అంశం అధికార పార్టీని ఇరుకున పెడుతుండగా తెలుగుదేశం పార్టీ కూడా అమరావతి ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటోంది.అమరావతి నుంచి రాజధాని తరలించవద్దని 29 గ్రామాల ప్రజలు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పోరాడుతోంది.
రైతులను క్షోభ పెడతారా ? మా మీద కోపంతో ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తారా అంటూ సెంటిమెంట్ డైలాగులు కూడా వదులుతోంది.ఇంతటితో ఆగకుండా అమరావతి పరిరక్షణ కమిటీ పేరుతో జేఏసీ ని కూడా ఏర్పాటు చేశారు.
అమరావతి వ్యవహారాన్ని మరింతగా రాజేసేందుకు ప్రస్తుతం బస్సుయాత్ర తో చంద్రబాబు రాజధాని అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి మైలేజ్ తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇది ఇలా ఉండగా అధికార పార్టీ తాము అమరావతి నుంచి రాజధాని తరలించడం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా అది ప్రజల్లోకి అంతగా వెళ్లలేక పోతోంది.ఈ విధంగా అధికార, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో నాలుగో రాజధానిగా రాజమండ్రి చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది.
ఈ మేరకు ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు నాలుగో రాజధానిగా రాజమండ్రి ని ప్రకటించాలంటూ కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకు వచ్చారు.రాజమండ్రిని సాంస్కృతిక రాజధాని చేయాలని, ఈ మేరకు త్వరలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్ లో ఈ ప్రతిపాదన తాను పెడతానని ఆయన చెబుతున్నారు.
ఇప్పటికే మూడు రాజధానుల అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన తరుణంలో నాలుగో రాజధాని ప్రతిపాదన అందరినీ షాక్ గురి చేస్తోంది.మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ గట్టిగా నినాదం వినిపిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఇది నిజంగా ఊహించని పరిణామమే.మూడు రాజధానులు వద్దే అంటూ గట్టిగా తాము పోరాడుతుంటే ఇప్పుడు నాలుగో రాజధాని అంటూ వైసీపీ మంత్రి హడావుడి చేయడం పై టిడిపి మండిపడుతోంది.ఇదంతా వైసీపీ కుట్ర అని, తాము చేస్తున్న ఉద్యమ ప్రభావం నుంచి బయటపడేందుకు అధికార పార్టీ ఇలా రాజముండ్రి ని తెర మీదకు తెచ్చినట్టు అనుమానిస్తోంది.