తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంపై పోస్టుమార్టం చేస్తోంది.రెండు రోజులుగా నియోజకవర్గాల వారీగా వివరాలు సేకరించి ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేస్తున్న అధినేత చంద్రబాబు తమకు ఏ పథకాలు మైలేజ్ తీసుకొచ్చాయి ? ఏ కారణాలతో టీడీపీకి ఓటర్లు దూరం అయ్యారు ? ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఎందుకు జనాల్లోకి వెళ్లలేకపోయాయి అనే అంశంపై లోతుగా విశ్లేషణ చేస్తున్నాడు.అయితే ఏపీలో గెలుపుపై టీడీపీ శిబిరంలో రోజురోజుకు ఆశలు అయితే పెద్దగా పెట్టుకోలేదు.ఏపీలో ఎన్నికలు జరిగి 20 రోజులైంది.ఇంకా 22 రోజుల్లో ఫలితాలు వస్తాయి.అయితే ఇప్పటికే బూత్ల వారీగా వివరాలు సేకరిస్తున్న బాబు కు గెలుపు మీద అసలు సన్నగిల్లిపోయినట్టు అర్ధం అవుతోంది
ప్రధానంగా తమకు ఓట్ల వర్షం కురిపిస్తుంది అనుకున్న పసుపు కుంకుమ పథకం, అన్నదాత సుఖీభవ, రైతు రుణ మాఫీ మొదలయినవన్నీ ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయని చంద్రబాబు విశ్లేషణలో అర్ధం అయిపొయింది.
గత ఎన్నికల మాదిరిగానే చివరి వారం రోజుల్లో తమ వైపు ప్రజలు వస్తారని టీడీపీ ఆశలు పెట్టుకుంది.కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది.
పసుపు కుంకుమ డబ్బులు సగం డ్వాక్రా సంఘాలకు కూడా అందలేదు.చెక్కులు అందిన సంఘాలకు బ్యాంకులు డబ్బులు ఇవ్వలేదు.
దీంతో మహిళల్లో టీడీపీ మీద మక్కువ పెరగకపోగా అదికాస్తా ఓట్ల రూపంలో టీడీపీకి దెబ్బపడినట్టు అనుమానిస్తున్నారు
అదీ కాకుండా పసుపు కుంకుమ చెక్కుల క్లియరెన్స్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని టీడీపీ అనుకూల మీడియా లో అనేక కథనాలు వస్తున్నాయి.తాము ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాలు తమను గట్టెక్కిస్తాయని భావించిన టీడీపీకి అవే పథకాలు దెబ్బసినట్టుగా బాబు పరిశీలనలో బయటపడ్డాయి.
అలాగే రైతు రుణమాఫీ నాలుగు, ఐదు విడతల డబ్బులు కూడా రైతులకు అందలేదు.కొందరి బ్యాంకు అకౌంట్లలో ఇప్పటివరకూ డబ్బు పడలేదు.
ఇంకొందరి అకౌంట్లలో పడితే పాత బాకీలకు జమ చేశారు.రెండు బ్యాంకు అకౌంట్లు ఉంటే.
ఏ అకౌంట్లలో అప్పు ఉంటే.ఆ అకౌంట్ బాకీ సెటిల్ చేశారు.
దీంతో రైతుల్లో కూడా టీడీపీ మీద ఆ తాలూకా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది అని తేలిందట.