ఎన్ని ఒడిదగుడుకులు వచ్చినా అదరకుండా బెదరకుండా ఉండే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి ఆగస్ట్ నెల వస్తుందంటే చాలు ఎన్నో భయాలు, ఆందోళనలు మొదలవుతుంటాయి.ప్రతి సంవత్సరం ఇదే నెలలో టీడీపీలో ఏదో ఒక సంక్షోభం తలెత్తడమో లేక ఎవరో ఒక కీలక నాయకుడిని కోల్పోవడమే జరుగుతుండడం ఆనవాయితీగా వస్తోంది.
ఆగస్ట్ అంటే టీడీపీ కి కలిసిరాని నెల అని దాదాపు పార్టీలో అందరూ ఫిక్స్ అయిపోయారు.దీనికి కారణం కూడా లేకపోలేదు.
అప్పట్లో ఎన్టీఆర్ కు ఆగస్టు నెలలో రెండు భారీ ఎదురు దెబ్బలు తగిలాయి.రెండు సార్లు కూడా ఆయన అధికారాన్ని కోల్పోయారు.
1984 ఆగస్టు 15వ తేదీన నాదెండ్ల భాస్కర రావు తిరుగుబాటు చేసి ఎన్టీఆర్ ను అధికారానికి దూరం చేసాడు.ఆ తర్వాత సరిగ్గా పదకొండేళ్లకు ఎన్టీఆర్ పై ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేశారు.ఇది 1995 ఆగస్టులో జరిగింది.ఆ తరువాత చంద్రబాబు సారధ్యంలో కూడా ప్రతి సంవత్సరం ఇదే నెలలో ఏదో ఒక అనుకోని సంఘటలను జరగడం ఆనవాయితీగా మారింది.
తెలుగుదేశం ప్రభుత్వానికి మాయని మచ్చలా బషీర్ బాగ్ కాల్పుల ఘటన కూడా ఆగస్ట్ లోనే జరిగింది.చంద్రబాబు మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన హరికృష్ణ సొంతంగా పార్టీ కూడా పెట్టారు.
ఆ తిరుగుబాటు కూడా ఆగస్ట్లోనే జరిగింది.
టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్న లాల్ జాన్ పాషా కూడా ఆగస్ట్ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.నందమూరి హరి కృష్ణ కూడా ఆగస్ట్ లోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఎన్నెన్నో సంక్షోభాలను టీడీపీ చూసింది.
ఇంకా మరెన్నో సంక్షోభాలు ఆగస్ట్ నెలలోనే ఎదురయ్యాయి.ప్రస్తుతం టీడీపీ అధికారంలో లేకపోవడం, అధికార పార్టీ వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుండడంతో పాటు బీజేపీ ఏపీలో పాగా వేసేందుకు టీడీపీని టార్గెట్ చేసుకోవడం ఇవన్నీ ఆందోళన కలిగిస్తున్న అంశాలే.
అందుకే మరికొద్ది రోజుల్లో ఆగస్టు రాబోతుండడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న ఆందోళన టీడీపీ అగ్ర నాయకుల్లో కనిపిస్తోంది.