తెలుగుదేశం పార్టీ లో ప్రస్తుతం నెంబర్ 2 స్థానంలో కొనసాగుతూ కాబోయే పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి గా టీడీపీ నాయకులు భావిస్తున్న లోకేష్ పై కొంతమంది తెలుగు తమ్ముళ్లకు ఇంకా నమ్మకం కలగడంలేదు.సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న టీడీపీకి 23 సంవత్సరాలుగా చంద్రబాబు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.
పదమూడేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బాబు తిరిగి మళ్ళీ విపక్ష పాత్రలోకే వచ్చేశారు.ప్రస్తుతం చంద్రబాబు వయస్సు డెబ్బయ్యేళ్ళు.
అంటే ఇక రాజకీయలకు రిటైర్మెంట్ ఇవ్వాల్సిన సమయం వచ్చేసిందన్నమాట.అందుకే లోకేష్ ను తన స్థాయిలో నాయకుడిగా నిలబెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
ప్రస్తుతం లోకేష్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు చంద్రబాబు.అయినా బాబు ఆశించిన స్థాయిలో మాత్రం చినబాబు పనితీరు ఉండడంలేదట.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా లోకేష్ కు ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చాడు చంద్రబాబు.రెండేళ్లపాటు కీలకమైన శాఖలకు మంత్రిగా పనిచేసినా లోకేష్ రాజకీయాలను సరిగా అర్ధం చేసుకోలేదని చెప్పాలి.అదే సమయంలో ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి.అటువంటి లోకేష్ కాబోయే టీడీపీ వారసుడు అంటే తెలుగు తమ్ముళ్లు ఆందోళనపడిపోతున్నారట.చినబాబు నాయకత్వం మీద తమకు నమ్మకం లేదని బాబు ఎదుటే బాహాటంగా చెప్పేస్తున్నారట.ఇదిలా ఉండగా టీడీపీ ఎందుకు ఓడిపోయింది అని బాబు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాడు.
కారణాలు తెలుసుకునేందుకు ఇప్పటికీ పార్టీ నాయకులతో సమావేశాలు పెడుతూనే ఉన్నాడు.కానీ టీడీపీ ఓటమిలో లోకేష్ కు ఎక్కువ భాగం వాటా ఉంది అనే విషయాన్ని అధినేత మర్చిపోతున్నారని తెలుగు తమ్ముళ్లు బాధపడిపోతున్నాడు.
పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చంద్రబాబు తరువాత లోకేష్ అన్న సంగతి అందరూ గ్రహించేశారు.పార్టీలోనూ ప్రభుత్వంలోనూ బాబు తరువాత స్థానంగా ఉన్న లోకేష్ కాబోయే సీఎం అని భావించిన జనాలు తెలివిగా టీడీపీకి ఓటేయలేదని టీడీపీ నాయకులు చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో చెప్పారట.చంద్రబాబు అంటే పరిపాలనా, అనుభవం అన్నీ ఉన్నాయని జనం 2014లో పట్టం కట్టారని, ఇక 2019లో చంద్రబాబుకి ఓటేస్తే ఎక్కడ లోకేష్ ను సీఎంగా ప్రకటిస్తారో అని చాలా మంది భయపడినట్టు కూడా టీడీపీ తెలుగు యువత ప్రెసిడెంట్ దేవినేని అవినాష్ చంద్రబాబు ఎదుటే చెప్పారట.ఆయన వైసీపీ లోకి వెళ్ళబోతున్నారని వార్తులు వినిపిస్తున్న నేపథ్యంలో తాను చంద్రబాబు నాయకత్వంలో మాత్రమే పనిచేస్తానని లోకేష్ నాయకత్వంలో అయితే తన దారి తాను చూసుకుంటానని చెప్పినట్టు సమాచారం.