కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.ఏపీలో వైసీపీ అధికారంలో ఉండటంతో పాటు టిడిపి ఉనికి కోల్పోయే పరిస్థితి ఉండడం, కీలక నాయకులంతా పార్టీని వదిలి వెళ్లడం, గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో సగం మంది పార్టీని వీడబోతున్నారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదనే అభిప్రాయానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వచ్చేసారు.
అందుకే అవకాశం దొరికిన ప్రతిసారి బీజేపీ మీద ప్రశంసలు కురిపిస్తూ ట్విట్స్ పెడుతూ ఆ పార్టీ అగ్ర నాయకుల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ విషయంలో కొంతవరకు సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది.
మొదట్లో వైసీపీతో సన్నిహితంగా మెలిగిన బిజెపి ప్రస్తుతం ఆ పార్టీని రాజకీయ శత్రువు గానే చూస్తోంది.ఇక ఏపీలో బలపడాలంటే బీజేపీకి కూడా ఏదో ఒక పార్టీ తో పొత్తు అవసరం.లేకపోతే ఫలితాలు ఎలా ఉంటాయో 2019 ఎన్నికల్లో బిజెపి చవిచూసింది.దీంతో టిడిపి మీద సదభిప్రాయం లేకపోయినా ఆ పార్టీతో సన్నిహితంగానే మెలుగుతున్నారు బీజేపీ పెద్దలు.తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీ చీఫ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసారు.తమకు వైసీపీ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను ఈ సందర్భంగా ఏకరువు పెట్టినట్టు తెలుస్తోంది.
పైకి మాత్రం అమరావతిని పొలిటికల్ మ్యాప్ పెట్టినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు తాము కలిశామని టిడిపి ఎంపీలు చెబుతున్నారు.అసలు విషయం మాత్రం బీజేపీకి దగ్గరయ్యేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతుంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి నేతలపై పెట్టిన అక్రమ కేసులు, వేధింపులు తదితర విషయాలను అమిత్ షాకు పూస గుచ్చినట్టుగా వివరించినట్లు తెలుస్తుంది.దీనిపై అమిత్ షా కూడా అన్ని విషయాలు తనకు తెలుసునని, వైసీపీ ప్రభుత్వం మీద చాలా ఫిర్యాదులు వచ్చాయని, ఇకపై అన్ని తాను చూసుకుంటానని భరోసా ఇచ్చినట్టుగా టిడిపి ఎంపీలు బయటకు చెప్పుకుంటున్నారు.
ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పోలీసులను తమ గుప్పెట్లో పెట్టుకుని టీడీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తోందని, స్వేచ్ఛగా బయట తిరిగే అవకాశం తమ నాయకులకు లేకుండా పోయిందని ఫిర్యాదు చేశారట.అన్ని విషయాలు నేను చూసుకుంటా మీరు నిశ్చింతగా ఉండండి అంటూ వారికి భరోసా ఇచ్చినట్టుగా టీడీపీ ఎంపీలు చెబుతున్నారు.