తిట్టేవారి కంటే పొగిడేవారితో జాగ్రత్తగా ఉండాలంటారు.ఎవరైనా మనల్ని పొగిడితే జాగ్రత్తగా ఉండాలి.
మనోడు మన శత్రువును పొగిడినా జాగ్రత్తగానే ఉండాలి.ఎందుకంటే ఏదో ఒకరోజు శత్రువుతో చేతులు కలుపుతాడనే విషయం అర్థం చేసుకోవాలి.
ఇదంతా ఎందుకు చెప్పుకోవల్సివస్తోందంటే….టీడీపీ మల్కాజ్గిరి ఎంపీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆకాశానికి ఎత్తేశారు.
కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి దొరకడం మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు.ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివసిస్తున్న పేదలకు కేసీఆర్ పట్టాలు పంపిణీ చేశారు.
ఆ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఇంత మంచి ముఖ్యమంత్రి దొరకడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.పేదలు పట్టాలు పొందడం కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైందన్నారు.
ప్రతిపక్ష నాయకులైనా మంచి పనులు చేసినప్పుడు అధికార పక్షాన్ని ప్రశంసించడం తప్పుకాదు.కాని ఇది సాధారణ రాజకీయ సూత్రాలకు విరుద్ధం.
ప్రస్తుతం టీడీపీ-టీఆర్ఎస్ సంబంధాలు ఎలా ఉన్నాయో తెలుసు.ఈ నేపథ్యంలో మల్లారెడ్డి ముఖ్యమంత్రిని ప్రశంసించారంటే ఆలోచించాల్సిందే.
అందులోనూ రేవంత్ రెడ్డి ఉదంతం తరువాత ఈ విధమైన వ్యాఖ్యలు అనుమానం కలిగిస్తున్నాయి.మల్లారెడ్డి త్వరలోనే జెండా ఎత్తేసి టీఆర్ఎస్లో చేరతాడా? అనే సందేహం కలుగుతోంది.ఈయనపై ఎప్పటి నుండో అనుమానాలున్నాయి.గులాబీ కండువా కప్పుకుంటాడని గతంలోనే వార్తలు వచ్చాయి.