పుండు మీద కారం పడినట్టుగా తెలుగుదేశం పార్టీకి వరుసగా కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి.ఇప్పటికే పంచాయతీ ఎన్నికలలో పార్టీ పరువు పోగా, అంతకు ముందు ఎంతో మంది టీడీపీ కీలక నాయకులు పార్టీకి రాజీనామా చేసి, అధికార పార్టీ వైసీపీలో చేరిపోయారు.
అలాగే మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తున్నారు.ఇక ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలతో టీడీపీకి రాజీనామా చేయించి, తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొట్టాలి అనే ఉద్దేశంతో వైసిపి రకరకాల ఎత్తుగడలు వేస్తోంది.
ఇదిలా ఉండగానే విజయవాడ టీడీపీ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.అక్కడ కీలక నాయకులుగా ఉన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్ర వేయించుకున్న ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మధ్య కొద్ది రోజుల క్రితం వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
విజయవాడ కార్పొరేషన్ లో పోటీ చేసే ఓ డివిజన్ అభ్యర్థి ని కేశినేని నాని మార్చడంతో వివాదం మొదలైంది.ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు.
అసలు బుద్ధ వెంకన్న కేసినేని నాని మధ్య వివాదం ఇప్పటిది కాదు.ఎప్పటి నుంచో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటూనే వస్తున్నారు.
తాజా వివాదంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు.అయితే ఈ వ్యవహారం పై టిడిపి అధినేత చంద్రబాబు జోక్యం చేసుకుని, సీరియస్ అయ్యారని, నానికి, వెంకన్నకు చంద్రబాబు గట్టిగానే క్లాస్ పీకారని మీడియాలో వార్తలు రావడంపైనా నాని సీరియస్ గానే సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
చంద్రబాబు తనకు ఎటువంటి క్లాస్ పీకలేదు అని పేర్కొంటూ సదరు వార్తా క్లిప్పింగ్ ను తన ట్వీట్ కి జోడించారు.దీంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.అసలు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలలో తన కుమార్తె ను మేయర్ చేయాలని నాని ఎప్పటి నుంచో చూస్తున్నారు.అయితే దీనికి పార్టీలోని కొంతమంది అడ్డుపడుతున్న నేపథ్యంలో నాని బహిరంగంగానే పార్టీ లోని తమ అసమ్మతి వర్గంపై ఫైర్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం పార్టీని వీడతారు అనే ప్రచారం కొద్దిరోజులుగా ఊపందుకుంది.
అసలు నాని ఎప్పుడో బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతూ వస్తున్నా, ఆయన టిడిపిలోనే కొనసాగుతున్నారు.
అయితే ప్రస్తుతం బుద్ధ వెంకన్న తో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆయన బిజెపిలో చేరే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది.మరికొంతమంది మాత్రం ఆయన టీడీపీలోనే కొనసాగుతారని, తమ కుమార్తె ను మేయర్ చేయడమే ఆయన లక్ష్యమని, అది టిడిపి ద్వారానే సాధించుకుంటారు అంటూ మరికొంతమంది టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.
కేశినేని నాని మాత్రం తన మనసులోనే మాటను బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు.