తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండడంతో ఆ పార్టీలో ఉండలేక, బయటకు వెళ్ళలేక సతమతమైపోతున్నారు.
ప్రస్తుతం ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీతో ఉంది.అసెంబ్లీలోనూ ఆ పార్టీదే హవా నడుస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే పరిమితమైంది.అందులోనూ ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో 22 మంది మాత్రమే మిగిలారు.
అయితే ఆ 22 మందిలోనూ సగం మంది అసెంబ్లీ సమావేశాలకు రావడమే లేదు.ఒకవేళ వచ్చినా టిడిపిలో నలుగురు మించి ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఉంది.
అసెంబ్లీలో గాని, బయటగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పితే ఎక్కడ కేసులు పెట్టి వేధిస్తారా అన్న ఆందోళన వారిలో బాగా కనిపిస్తోంది.
అందుకే ప్రభుత్వం పై విమర్శలు చేసే అవకాశం ఉన్నా, నియోజకవర్గాల్లో అనేక సమస్యలు ప్రస్తావించాల్సి ఉన్నా, వీరు అసెంబ్లీలో నోరెత్తకుండా సైలెంట్ గా ఉండిపోతున్నారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్యెల్యేల్లో చాలామందికి వారి గత జ్ఞాపకాలు వేధిస్తున్నాయి.ఇప్పుడే ఏం మాట్లాడినా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, కేసులు ఇరికించి జైలుకు పంపించేందుకు కూడా వెనుకాడదు అనే భయం సీనియర్ నాయకుల్లోనూ ఉన్నట్టుగా కొంతమంది చెబుతున్నారు.
అయితే రాజకీయాల్లో ఉన్న వారికి పోలీసులు, కేసులు అనేవి సర్వ సాధారణం వాటిని చూసి భయపడే పరిస్థితి లేదు.కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్న నాయకుల వ్యవహారాన్ని గమనిస్తే వారిలో భయం కంటే తమ భవిష్యత్తు పై ఆందోళన ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.
తాము ఎమ్మెల్యేగా ఉన్నాము కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ పనులు సజావుగా సాగిపోతే ఫర్వాలేదు అన్నట్టుగా వీరు వ్యవహరిస్తున్నారు.మద్యం దుకాణాలు, బార్లను ఆశిస్తున్న వారిలో ఎక్కువ మంది టిడిపి నాయకులే ఉన్నట్టుగా అసెంబ్లీలో మంత్రి శంకరనారాయణ చెప్పారు.అలాగే అనేక రూపాల్లో ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు, వ్యాపారాలు ముడి పడి ఉన్నాయి.ఈ నేపథ్యంలో అధికార పార్టీతో విరోధం పెట్టుకుని తాము మరింతగా ఇబ్బంది పడడం ఎందుకు అన్నట్టుగా వీరంతా సైలెంట్ అయిపోతున్నట్టు కనిపిస్తోంది.
వాస్తవానికి వీరంతా ఏపీలో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే ఆశతో భారీగా పెట్టుబడులు పెట్టారు.టిడీపి కూడా తమ ప్రభుత్వం రాబోతున్నట్టు అనేక సర్వేల రిపోర్టులను చూపించింది.
దీంతో ఎన్నికలకు ముందే తమ సొంత నిధులు చాలా పెట్టుబడి పెట్టి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయించారు.కానీ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆ బిల్లులు అన్నీ పెండింగ్ లో పడ్డాయి.
ఈ నేపథ్యంలోనే తమకు ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా ఎవరికి వారు సైడ్ అయిపోతున్నారు.అంతే కాకుండా ఇప్పుడున్న వారిలో సగం మంది పార్టీ మారే ఆలోచనలో ఉండడంతో టిడిపి ఇటువంటి ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటోంది.