సోషల్ మీడియాలో తనపై అసభ్య పదజాలంతో ఉపయోగిస్తూ పోస్టింగ్ లు పెడుతున్నారు అంటూ టిడిపి మహిళా ఎమ్మెల్యే రాజమండ్రి శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవాని స్పీకర్ తమ్మినేని సీతారాం కు ఫిర్యాదు చేశారు.ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజు సందర్భంగా ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో ఆదిరెడ్డి భవాని తన పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు అంటూ ఫిర్యాదు చేశారు.
సోమవారం అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది ఇష్టమొచ్చినట్లుగా అసభ్యకర పదజాలంతో విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దీనికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
తాను ఏ పదవులు ఆశించి తెలుగుదేశంలోకి కానీ, రాజకీయాల్లోకి కానీ రాలేదని, తన చిన్నతనంలోనే తన తండ్రి ఇటు మామ గారు ఎన్నో పదవులు అనుభవించారని, తమ కుటుంబానికి పదవులు కొత్తేమీ కాదు అని ఆమె అన్నారు.పార్టీకి, ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని భవాని భావోద్వేగంగా ప్రసంగించారు.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.భవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పీకర్ చర్యలు తీసుకునేలా వ్యవహరిస్తారా లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొంది.