ఏపీలో అధికార టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని రవాణా శాఖ అంశంపై ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునే వరకు ఈ ఇష్యూని వదిలేలా లేరు.బస్సుల వివాదంలో ఆయన కొద్ది రోజులుగా ప్రభుత్వంపై సైతం దూకుడుగా ముందుకు వెళుతూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా ఆయన మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్గా చేస్తూ చేసిన వ్యాఖ్యలు అటు ప్రభుత్వానికి, ఇటు టీడీపీకి ఇబ్బంది కరంగా మారాయి.అరుణాచల్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన 900 బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తే ఏపీ రవాణాశాఖ ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని ఆయన ఘాటుగా విమర్శించారు.
నాని వ్యాఖ్యలు టీడీపీ నేతల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి.
కొద్ది రోజులుగా రవాణాశాఖను టార్గెట్గా చేస్తూ వస్తోన్న ఎంపీ నాని తాజాగా రవాణాశాఖ మొత్తం అవినీతిమయంలో కూరుకుపోయిందని, అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వం రాంగ్ రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించినా మన రాష్ట్ర ప్రభుత్వానికి అస్సలు పట్టలేదని ఫైర్ అయ్యారు.
ఈ వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.మనకు స్లీపర్ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతోనే అరుణాచల్ ప్రదేశ్ బస్సులను ఇక్కడ అనుమతించామని, కేశినేని వ్యాఖ్యలు వ్యక్తిగతంగానే చేశారే తప్ప, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఖండించారు.
అచ్చెన్న వ్యాఖ్యలను నాని లైట్ తీస్కోకుండా రిప్లై ఇచ్చారు.టీడీపీలో చంద్రబాబు లేదా లోకేశ్ తప్ప ఎవరూ మాట్లాడినా అది వ్యక్తిగత హోదాలో మాట్లాడినట్టే అవుతుందని కౌంటర్ ఇచ్చారు.
తాను మాట్లాడినా లేదా అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా ఇలా ఇవ్వరూ మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమే అని నాని చెప్పారు.జనం కోసమే బస్సులు నడుపుతున్నారని అచ్చెన్న చెప్పడాన్ని సైతం నాని ఖండించారు.
జనానికి అవసరం ఉందని పేకాట, వ్యభిచారం అనుమతి ఇస్తామా ? అని ఆయన ప్రశ్నించారు.ప్రజలకు అవసరమైన సౌకర్యాలు చట్టవిరుద్ధంగా అనుమతించవచ్చన్నది మంత్రుల అభిప్రాయం అయితే తానేం చేయలేనని నాని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేశారు.
ఇక నాని వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపడంతో మంత్రి లోకేశ్ నేరుగా నానికే ఫోన్ చేసినట్టు తెలుస్తోంది.
బస్సుల విషయంలో ఎలాంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయవద్దని, అలా చేస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని, తాను విదేశాల నుంచి వచ్చాకే అన్ని విషయాలు మాట్లాడదామని లోకేశ్ నానితో చెప్పారని సమాచారం.
ఏదేమైనా నాని ఈ బస్సుల విషయంలో ప్రభుత్వంతో తాడు లాగే వరకు వదిలేలా లేన్నట్టుగానే వ్యవహారం కనిపిస్తోంది.