అసలే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టెడు కష్టాల్లో ఉంది.అధికార పార్టీ వేధింపులు, అరెస్టులతో తెలుగుదేశం నాయకులు అంతా బెంబేలెత్తిపోతున్నారు.
ఈ సమయంలో అంతా ఏకతాటిపై ఉంటూ, పార్టీ పరిస్థితి మెరుగయ్యే విధంగా వ్యవహరిస్తూ, పార్టీ శ్రేణులకు ధైర్యం నూరిపోస్తూ ఉండాల్సిన నేతలు, ఇప్పుడు ఓ పదవి విషయమై తీవ్రంగా వాదులాడుకోవడం , బహిరంగంగా విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది.ప్రస్తుతం స్థానిక సంస్థలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు.
కరోనా వ్యవహారం సద్దుమణగడం, అలాగే ఏపీ ఎన్నికల కమిషనర్ విషయంలో కోర్టు వ్యవహారాలు ఉండడం, ఇవన్నీ చక్కబడే వరకు ఏపీలో ఆ ఎన్నికలు జరిగే అవకాశమే లేదు.కానీ అప్పుడే విజయవాడ మేయర్ అభ్యర్థి ఎవరనే విషయంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ మధ్య వివాదం చెలరేగింది.
మేయర్ అభ్యర్ధిత్వం తమకే ఖరారు అయినట్టుగా, ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత టిడీపి మేయర్ అభ్యర్ధిగా ఎంపీ వర్గీయులు ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు కూడా శ్వేత కు మేయర్ అభ్యర్థిత్వం కట్టబెట్టేందుకు డిసైడ్ అయినట్లు ఎంపీ వర్గం ప్రచారం చేసుకుంటున్నారు.
శ్వేత విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె .ఆమె గత పార్లమెంట్ ఎన్నికల్లో కేసినేని నాని తరుపున విస్తృతంగా ప్రచారం చేసి, ఆయన విజయానికి కారణం అయ్యారు.ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతోనూ, ప్రజల్లోనూ, బాగా పరిచయాలు ఏర్పడడంతో, ఈ మేరకు ఆమె అయితేనే ఫలితం బాగుంటుంది అని శ్వేతను రంగంలోకి చంద్రబాబు దింపినట్టు గా, ఎంపీ వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు.
ఇదే మేయర్ అభ్యర్ధిత్వం విషయంలో, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అడ్డుపడుతున్నారు.రామ్మోహన్ రావు సతీమణి అనురాధ మేయర్ అభ్యర్థి రేసులో ఉన్నట్లు, ఈ మేరకు చంద్రబాబు నుంచి హామీ కూడా తీసుకున్నట్లు ఎమ్మెల్యే వర్గీయులు ప్రచారం చేస్తున్నారు.ఈ ప్రచారం ఇలా ఉండగానే, ఎంపీ వర్గీయులు శ్వేత పేరును తెరపైకి తీసుకొచ్చారని ఎమ్మెల్యే రామ్మోహన్ వర్గీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై కొద్ది రోజులుగా తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు.తాజాగా ఈ వ్యవహారంపై టిడిపి విజయవాడ నగర ఇంఛార్జి బుద్ధ వెంకన్న కు గద్దె రామ్మోహన్ ఫిర్యాదు చేశారు.
మేయర్ విషయంలో క్లారిటీ ఇవ్వాలంటూ ఆయన ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో దుమారం రేపుతోంది.ఇక ఈ విషయం టిడిపి అధినేత చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లడంతో, ఆయన ఇద్దరినీ పిలిచి నచ్చచెప్పేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.