తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ పూర్తిగా లోపించినట్టు కనిపిస్తోంది.పార్టీ సూచనలు, సలహాలను తెలుగు తమ్ముళ్లు పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.
దీంతో పార్టీ పై చంద్రబాబు పట్టు కోల్పోతున్నారా అనే అనుమానాలు ఎన్నో తలెత్తుతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో తప్పించి ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో కానీ, ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో గానీ కనీసం మీడియా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో గాని, తెలుగు తమ్ముళ్లు ఆసక్తి చూపించడం లేదు.
ముఖ్యంగా నియోజకవర్గస్థాయి నాయకులు పూర్తిగా నిరాశా నిస్పృహల్లో ఉండిపోయారు.ఆర్థికంగా పార్టీకి అండ దండలు అందిస్తూ వచ్చిన నాయకులు సైతం ఇప్పుడు తమకు ఏమీ పట్టనట్లు గా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆర్థికంగా బలమైన నేతలను చంద్రబాబు రంగంలోకి దింపారు.అయితే వాళ్లల్లో చాలామంది పెద్దగా సొమ్ములు బయటకు తియకపోవడం, ప్రచారం అంతంత మాత్రంగా నిర్వహించడం వంటి విషయాలు బాబు దృష్టికి వెళ్ళాయట. చంద్రబాబు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.ఇందులో ఈ అంశాలపై బాబు ప్రస్తావించగా, దానికి నాయకుల నుంచి అంతే స్థాయిలో సమాధానం వచ్చిందట.గత ఎన్నికల సమయంలో భారీగా సొమ్ము లు వెచ్చించాము అని, అప్పుడు చేసిన అప్పులు ఇప్పటి వరకు తీరలేదు అని , వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తమ వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి అని, ఆర్థికంగా తీరని కష్టాల్లో ఉన్నామని , ఈ సమయంలో పార్టీ కోసం భారీగా సొమ్ములు వెచ్చించి 2024 వరకూ కార్యకలాపాలు నిర్వహించడం తమ వల్ల కాదు అంటూ బాబు కి స్ట్రాంగ్ గా చెప్పారట.ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేమని, అప్పుడప్పుడు అంటే పర్వాలేదు కానీ, మొత్తం ఆర్థిక భారం అంతా, తమ నెత్తిన రుద్దితే ఎలా అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారట.
అయితే దీనికి బాబు నుంచి ఘాటు సమాధానం వచ్చిందట.పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలేము అని ఇప్పుడే చేతులెత్తేస్తే ఎలా అని, కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో అందరూ యాక్టివ్ గా ఉండాల్సిందేనని, అలా కానీ పక్షంలో తాను ఆయా నియోజకవర్గాల్లో మరో ప్రత్యామ్నాయం చూసుకుని వారిని ప్రోత్సహిస్తా అంటూ చెప్పినట్లు తెలుస్తోంది.అయినా తమ్ముళ్లు మాత్రం బాబు మాటను పట్టించుకునే స్థితిలో అయితే లేరట.