టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు వ్యవహారం తెలుగుదేశం పార్టీలు ప్రకంపనలు సృష్టించింది.ఓ ప్రైవేట్ హోటల్లో అచ్చెన్న పార్టీ సంబంధించిన కీలక నాయకుడు కి మధ్య జరిగిన సంభాషణ మొత్తం వీడియో లో రికార్డు కావడం, అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో టిడిపి ఇరకాటంలో పడింది.
ఆయనే సరిగ్గా ఉంటే తమకు ఈ ఇబ్బందులు ఎందుకని , 17 తర్వాత ఫ్రీ అయిపోతాం, పార్టీ లేదు తొక్కా లేదు అంటూ అచ్చెన్న మాట్లాడిన మాటలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.అచ్చెన్న నాయుడు మాటలు నిజంగా ఆయన మాట్లాడినవా లేక మార్ఫింగ్ చేసినవా అనేది పక్కన పెడితే, అదే అభిప్రాయం పార్టీలోని మెజారిటీ నాయకుల్లో ఉందనేది వాస్తవం.
లోకేష్ శక్తి సామర్థ్యాలపై ఆయన రానున్న రోజుల్లో పార్టీని ముందుకు నడిపించే తీరు పై ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేవు. మొదటి నుంచి చంద్రబాబుకు అండగా నిలబడుతూ వస్తున్న సీనియర్ నాయకులు ఎవరికి లోకేష్ విశయంలో సానుకూల వైఖరి లేదు.
ఆయన కారణంగా పార్టీ ఇబ్బందుల్లో పడుతుందనే అభిప్రాయమే మెజారిటీ నాయకులలో ఉంది.ఎంతో మంది సీనియర్లు ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో బహిరంగంగానే మాట్లాడారు.వల్లభనేని వంశీ వంటి నాయకులు టిడిపిని వీడి బయటకు వచ్చేయడానికి కారణం లోకేష్ అనే విషయాన్ని మీడియా ముందు చెబుతూ, ఇప్పటికీ విమర్శలు చేస్తూనే వస్తున్నారు.చంద్రబాబు స్థాయిలో రాజకీయ వ్యూహాలు పన్నడంలో కానీ, ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో కానీ , సొంత పార్టీ నాయకులకు ప్రయోజనం కలిగించే విధంగా వ్యవహరించడం లో కానీ, లోకేష్ పని తీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదు అనేది అందరికీ ఉన్న అభిప్రాయం.
పైకి చెప్పకపోయినా, అచ్చెన్న లోకేష్ విషయంలో నిజమే మాట్లాడారని, ఆయన సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి ఎందుకు వచ్చేది అంటూ ఇప్పుడు ఒక్కొక్కరుగా తమ మనసులో మాటను బయట పెడుతున్నారు.
లోకేష్ విషయంలో అచ్చెన్న వ్యాఖ్యలపై చంద్రబాబు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.అయితే ఇప్పటికిప్పుడు అచ్చెన్న పై ఏ చర్యలు తీసుకున్నా, ఆ వీడియోలో మాట్లాడిన మాటలన్నీ నిజం అనే అభిప్రాయం అందరిలోనూ కలుగుతుంది అనే ఉద్దేశంతో సైలెంట్ అయ్యారట.కానీ అంతర్గతంగా ఈ పరిణామాల పై చంద్రబాబు, లోకేష్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.