తెలుగుదేశం పార్టీ దాదాపు 10ఏళ్ల పాటు పోరాటం చేసి మరోసారి అధికారంలోకి వచ్చింది.అయితే ఆ పార్టీ అధికారాన్ని చేపట్టి 6నెలలే అయినప్పటికీ అప్పుడే పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి.
ఎంతో మంది నాయకులు, మంత్రులు, ఎంపీలు సైతం పార్టీపై, చంద్రబాబు పని తీరుపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
ఇందులో మొదటిగా చెప్పాల్సింది ఉపముఖ్యమంత్రి కేయీ కృష్ణ మూర్తి గురించి…ఆయన చంద్రబాబు పని తీరుపై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే, అయితే దానికి గల కారణాలు ఏంటి అని అంటే చంద్రబాబు నిట్ లేదా ఐ.ఐ.టీ రెండింటిలో ఏదో ఒకటి రాయలసీమకు ఇస్తాను అని చెప్పి ఇప్పుడు అంతా తీసుకువెళ్ళి సీమాంధ్రకే కట్ట పెట్టారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ చంద్రబాబుపై విమర్శలు చేశారు.ఇక విజయవాడ ఎంపీ కేశనేని నాని సైతం దేవినేని ఉమ విజయవాడ వ్యవహారాల్లో కొంచెం ఎక్కువగా కల్పించుకోవడంపై బహిరంగంగానే విమర్శలు చేశారు.ఇక గత కొంత కాలంగా అనంతపురం నేత జేసీ, గుంటూరు నేత రాయపాటి సైతం మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తుంది.
మరి ఇంత అసంతృప్తి మధ్య చంద్రబాబు ఎవర్ని ఎలా బుజ్జగిస్తారో తెలీదు కానీ ఇప్పటికైతే అందరినీ ఉద్దేశించి ఎవ్వరూ తమ అసంతృప్తిని మీడియాకు తెలియజేయకూడదని, ఏదైనా ఉంటే తనకు తెలుపమని సెలవిచ్చారు.మరి ఇప్పటికైనా నేతలు బాబు మాట వింటారో లేదో చూడాలి.