గతంతో పోలిస్తే తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.పార్టీ నాయకులు అధికార పార్టీ వైసీపీ పై విమర్శలు చేసేందుకు భయపడుతూ వచ్చేసారు.
నాయకులు సైతం ఇప్పుడు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ తీరుపై బహిరంగంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.దీనికి కారణం ఇప్పుడు వైసీపీలోని చాలామంది నాయకులు ప్రభుత్వ తీరుపైనా, జగన్ పైనా బహిరంగ విమర్శలు చేసే పరిస్థితి కనిపిస్తోంది.
దీనికి తోడు ఇటీవల వివిధ కమిటీల పేరుతో పెద్ద ఎత్తున పదవులను భర్తీ చేయడం, యువ నాయకులకు పెద్ద పీట వేయడం వంటి కారణాలతో ఎక్కడికక్కడ నాయకుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాగలము అనే నమ్మకం అందరిలో కనిపిస్తోంది.
ఈ పరిణామాలు టిడిపి అధినేత చంద్రబాబులోనూ ఆనందాన్ని కలిగిస్తున్నాయి.నిరాశ నిస్పృహలో ఉన్న పార్టీ కేడర్ ను యాక్టీవ్ చేసేందుకు ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు.
చివరకు అనుకున్నది అనుకున్నట్లుగా సాధ్యం అయ్యింది అనేది బాబు అభిప్రాయం.
ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లో చంద్రబాబు పదేపదే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి అంటూ అదేపనిగా చెబుతూ ఉండడం, జమిలి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, అధికార పార్టీ వైసీపీ పై నిత్యం ప్రజా పోరాటం చేస్తూ, ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేయాలని చెప్పడం వంటివి మొదట్లో టీడీపీ క్యాడర్ లో తీవ్ర అసంతృప్తిని కలిగించాయి.
మొన్ననే ఎన్నికలు జరిగాయి, అయినా జమిలి ఎన్నికలు అంటూ బాబు అనవసరంగా ఆందోళన చెందుతూ తమను ఆందోళన కు గురి చేస్తున్నారు అంటూ తెలుగు తమ్ముళ్ళ బాబు తీరుపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చేవారు.
కానీ ఇప్పుడు అదే ఎన్నికల ప్రస్తావన కేంద్ర బిజెపి పెద్దలు, ప్రధాని నరేంద్రమోదీ వంటివారు తీసుకురావడం, 2022లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుండడం వంటి పరిణామాలను చూసి బాబు చెప్పిందే నిజం అవుతోందని, బాబు ముందు చూపుతోనే వ్యవహరిస్తున్నారని, అనవసరంగా అపార్థం చేసుకున్నాము అనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది.దీనికి తగ్గట్టుగానే ఎక్కడికక్కడ టిడిపి నాయకులంతా యాక్టివ్ అయ్యారు. 2022 ఎన్నికలలో అధికారం సాధించాలనే దిశగా పార్టీని బలోపేతం చేయాలనే విషయంపైనే దృష్టి పెడుతున్నారు.