ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఇంటాబయటా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతోంది.పార్టీకి అండగా ఉంటారు అనుకున్న నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతూ ఉండటం, అదే సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ పార్టీ పరువు తీస్తుండడంతో చంద్రబాబులో అసహనం పెరిగిపోతూ వస్తోంది.
వయసు రీత్యా చూసుకుంటే చంద్రబాబు ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పవలసిన సమయం వచ్చేసినట్టే.అయితే తాను విశ్రాంతి తీసుకుంటే పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలిగిన నాయకులు ఎవరున్నారు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.
పోనీ ఇప్పటికిప్పుడు ఆ బాధ్యతలు తన రాజకీయ వారసుడు లోకేష్ బాబు కి అప్పగిద్దామా అంటే , ఆయనకు పార్టీని నడిపించే అంత శక్తి సామర్ధ్యాలు కానీ, వాక్చాతుర్యం కానీ లేకపోవడం బాబు ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి.
తెలుగుదేశం పార్టీలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెరమీదకు వస్తోంది.ఇప్పటికిప్పుడు పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్లాలంటే జూనియర్ ఎన్టీఆర్ రాక తప్పదని, ఆయన ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అని అంతా భావిస్తున్నారు.ఎన్టీఆర్ శక్తిసామర్ధ్యా లు, ఆయన వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.2009 ఎన్నికల సమయంలో ఆకట్టుకునే వాక్చాతుర్యంతో టిడిపికి అండగా నిలబడి ఆ పార్టీకి పునర్వైభవం తీసుకురాగలిగాడు.ఒకరకంగా చంద్రబాబు కంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగాల కే ఆదరణ ఎక్కువగా కనిపించింది.
కానీ ఆ ప్రచారం ముగిసిన తర్వాత జూనియర్ ను చంద్రబాబు పక్కన పెట్టడంతో ఎన్టీఆర్ మనస్థాపం చెందాడు.పార్టీ కోసం తాను అంతగా కష్టపడితే లోకేష్ కోసం తనను పక్కన పెట్టేశారు అని ఎన్టీఆర్ తన సన్నిహితుల దగ్గర వాపోయేవారట.
తెలుగుదేశం ఆవిర్భావం తరువాత ఇప్పుడున్న గడ్డు పరిస్థితి గతంలో ఎప్పుడు ఎదుర్కోలేదు.ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో టిడిపి పరిస్థితి దారుణంగా మారిపోయింది.175 స్థానాలకు కేవలం 23 సీట్లు మాత్రమే దక్కించుకోవడం ఆ పార్టీ నేతలకు ఇప్పటికీ మింగుడుపడని అంశంగా మారిపోయింది.ఇప్పుడు ఒక్కో నేత పార్టీకి దూరమవుతున్నారు.
ప్రధానంగా సొంత సామాజిక వర్గం నేతలంతా తన పైన, తన కుమారుడిపైనా విమర్శలు చేస్తూ బయటకు వెళ్లడం బాబు జీర్ణించుకోలేకపోతున్నారు.అలాగే గతంలో కనిపించిన క్రమశిక్షణ కూడా పార్టీలో పెద్దగా కనిపించడం లేదు.
అసలు కొంతమంది నేతలు చంద్రబాబును, ఆయన మాటను లెక్క చేసే పరిస్థితుల్లో లేరు.ఈ దశలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పార్టీకి పునర్వైభవం తీసుకు రాగలడు అనే వ్యాఖ్యలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి.