వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలలో ఒక నిర్ణయం గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావటం.ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనులు వీళ్ళ చేతుల మీదగా జరిగే రీతిలో వ్యవస్థను తీసుకొచ్చారు.
ఈ వ్యవస్థపై ప్రతిపక్షాలు ముందు నుండి విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అసలు రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండకూడదు వెంటనే తీసేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పర్యటన సమయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా కాకుండా ఎలక్షన్ సమయంలో ఓట్లు వేయించుకోవడానికి పూర్తిగా పని చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు.
అలాంటి వ్యవస్థ ప్రజా స్వామ్యం లో ఉండకూడదని తీసి వేయాలని డిమాండ్ చేశారు.
ఇక పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఇష్టానుసారంగా వ్యవహరించిందని ప్రత్యర్థులను భయబ్రాంతులకు గురి చేసి ఎన్నికలలో ఎక్కువ స్థానాలు గెలిచి గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు.కుప్పంలో ఓడిపోవడానికి కారణం కూడా ఇదే అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికలలో టిడిపి క్యాడర్ మొత్తం ఏకమైతే ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు గెలవడం జరుగుతుంది అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
.