ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏకైక మార్గం ‘పాదయాత్ర’.ఇదే ప్రస్తుత రాజకీయ పార్టీలకు తెలిసిన సులువైన ఏకైక మార్గం.
అసలు ఈ పాదయాత్రల సంస్కృతికి శ్రీకారం చుట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి కాగా ఆ తరువాత చంద్రబాబు ఆ తరువాత వైఎస్ జగన్ ఇలా అంతా ఇదే బాటలో పయనించి అధికారంలోకి వచ్చారు.గత పాదయాత్రలు ఎలా ఉన్నా, జగన్ చేసిన పాదయాత్ర కొత్త ట్రెండ్ సృష్టించిందనే చెప్పాలి.
జగన్ సుదీర్ఘకాలం పాదయాత్ర చేయడం, ప్రజల్లో మమేకం అవ్వడం, ప్రజల కాస్త సుఖాలను స్వయంగా అడిగి తెలుసుకోవడం ఇవన్నీ ఆ పార్టీకి తిరుగులేని మెజార్టీ తీసుకొచ్చింది.ఈ ఫార్ములా సూపర్ సక్సెస్ అవ్వడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ పాదయాత్ర ద్వారా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలని చూస్తున్నాడు.
ఈ యాత్ర చేపట్టడం ద్వారా రాజకీయంగా తన ఇమేజ్ ను పెంచుకోవడంతో పాటు , పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన దిశగా లోకేష్ పాదయాత్ర కొనసాగబోతోందట.లోకేష్ సాగించే ఈ పాదయాత్రలో షరతులు కూడా వర్తిస్తాయి అని టీడీపీ నాయకులు చెబుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ చేయనున్న పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర గా ఉండబోదని, మధ్య మధ్యలో బ్రేక్ లు కూడా ఉంటాయి అంటూ చెబుతున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో సుదీర్ఘ పాదయాత్ర అవసరం లేదని, విడతలవారీగా విరామం తీసుకుంటూ పాదయాత్ర సాగిస్తారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
ఏపీలో ఓటమిపాలైన తర్వాత వైసీపీ చేస్తున్న ఎదురు దాడిని ఎదుర్కోవడానికి రంగంలోకి దిగిన లోకేష్ బాబు ట్విట్టర్ వేదికగా వైసీపీ పై ఎదురు దాడి చేస్తున్నా ఆ క్రెడిట్ ఆయనకు దక్కడంలేదు.
లోకేష్ సొంతంగా ట్విట్లు పెట్టే సామర్ధ్యం లేదని, ఎవరితోనో రాయించి పెడుతున్న ట్వీట్ లు అంటూ వైసీపీ నేతలు లోకేష్ ను విమర్శిస్తూ ఇబ్బందులు పెడుతున్నారు.
అంతే కాదు పప్పు అంటూ పదే పదే విమర్శిస్తూ పరువు తీస్తుండడంతో లోకేష్ తన పరపతిని పెంచుకోవడానికి ఈ విధంగా పాదయాత్ర ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.అయితే ఈ పాదయాత్ర ఇప్పటికిప్పుడు ప్రారంభం కాకపోయినా మరికొన్ని రోజుల్లో మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఈ యాత్రకు సంబందించిన షెడ్యూల్ తదితర అంశాలను పర్యవేక్షించడానికి ఇప్పటికే ఒక టీమ్ ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.