ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్దానాలను గెలుచుకుని తన హవా ఇంకా తగ్గలేదని నిరూపించుకుంది.చాలా స్దానాల్లో ఏకగ్రీవంగా కూడా ఎన్నికైన విషయం తెలిసిందే.
దీని మీద కూడా ఈ రెండు పార్టీలు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నాయి.
ఇదే సమయంలో ఓటమిని జీర్ణించుకో లేకుండా ఉన్న టీడీపీకి గట్టి వాతే పడింది.
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చింది.దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారి వేడెక్కింది.ఈ సందర్భంగా రెండుపార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపని టీడీపీ నేతలు మండిపడుతుండగా, చంద్రబాబు తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గతంలో వైఎస్ జగన్ ను సీబీఐ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసి, చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచినప్పుడు జగన్ కూడా బెయిలు తెచ్చుకున్నారు.ఒకవేళ ఇందులో జగన్ తప్పు లేనప్పుడు నిజాలు తేలేంత వరకు జైల్లోనే ఉండొచ్చు కదా? అని ప్రశ్నించారు.అలాగే ప్రస్తుతం చంద్రబాబు కూడా అదే హక్కుతో కోర్టును ఆశ్రయించారని ఇందులో తప్పుపట్టడానికి ఏం కనిపిస్తుందని బాబు మీద ఆరోపణలు చేస్తున్న నేతలను ప్రశ్నించారు.