అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించి, అధికారం కోల్పోయాక నీతులు చెప్పడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందేమో.చంద్రబాబు ప్రతిపక్షంలోకి వెళ్ళాక, పలువురు నేతలు టీడీపీని వీడి వైసీపీలోకి వెళుతున్న విషయం తెలిసిందే.
అలాగే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బాబుకు షాక్ ఇచ్చి జగన్కు జై కొట్టారు.వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలు ముందే టీడీపీని వీడితే తాజాగా విశాఖకు చెందిన వాసుపల్లి బాబుకు షాక్ ఇచ్చారు.
దీంతో బాబు వెంటనే విశాఖ టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ పెట్టేసి నీతులు చెప్పారు.నాయకులు వస్తారు… పోతారు…పార్టీ శాశ్వతమని, ప్రజల ఆదరణ, కార్యకర్తల అభిమానం ఉన్నంతకాలం టీడీపీకి ఢోకా లేదని, పార్టీకి ద్రోహం చేసిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని బాబు గురివింద సామెతని గుర్తు చేశారు.
వాస్తవానికి ఇలా పార్టీలు మారే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అందుకే 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు.
ఎందుకంటే ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి, చంద్రబాబు వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలని ఏ విధంగా లొంగదీసుకున్నారో ప్రజలందరికీ తెలుసు.అసలు ఏ మాత్రం రాజకీయపరమైన నీతి పాటించకుండా వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని టీడీపీలోకి తీసుకున్నారు.
వారిని ఏ రకంగా టీడీపీలోకి లాక్కొచ్చారో చెప్పాల్సిన పనిలేదు.అసలు వైసీపీ నుంచి గెలిచినవారిని నిసిగ్గుగా పార్టీకి రాజీనామా చేయించకుండా, నలుగురుకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు.
అందుకే బాబు ఇలా చేసినందుకే 2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించారు.అసలు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినవారిలో ఒక్క గొట్టిపాటి రవికుమార్ మిగతా వారంతా ఘోరంగా ఓడిపోయారు.ఇక అప్పుడు నీతులు మాట్లాడని బాబు, అధికారం కోల్పోయాక మాత్రం నీతులు చెబుతున్నారు.అయితే బాబు మాదిరిగా జగన్ చేయడం లేదు.పార్టీలోకి రావాలంటే పదవికి రాజీనామా చేసే రావాలని కండిషన్ పెట్టారు.దీంతో ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేయకుండా అధికారికంగా వైసీపీలో చేరకుండా, జగన్కు సపోర్ట్ ఇస్తున్నారు.